అమెరికాలోని ఉత్తర టెక్సాస్ ప్రాంతంలో భారతీయుల అతిపెద్ద వార్షిక వేడుకల్లో ఒకటైన 49వ ఆనంద్ బజార్ (Anand Bazaar) నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (IANT) ఆధ్వర్యంలో ఆగస్టు 15, శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో నగరంలోని కొమెరికా సెంటర్ వేదికగా ఈ మహోత్సవం జరగనుంది. ఈ ఏడాది భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక వేడుకలతో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఈ వేడుకల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా సాంస్కృతిక ప్రదర్శనలు, స్వాతంత్య్ర దినోత్సవ పరేడ్, సంగీత కచేరీలు, ప్రముఖుల ప్రసంగాలు, కమ్యూనిటీ సన్మానాలు, చిన్నారుల కోసం ప్రత్యేక ఆటల విభాగం, వివిధ వెండర్ స్టాల్స్ వంటి అనేక ఆకర్షణీయ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రవాస భారతీయులతో పాటు స్థానిక అమెరికన్లు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.
ఈసారి కార్యక్రమాన్ని ఇండోర్ వేదికలో నిర్వహించడం వల్ల వాతావరణానికి ఇబ్బంది లేకుండా కుటుంబ సమేతంగా పాల్గొని వేడుకలను ఆస్వాదించవచ్చని IANT వెల్లడించింది. ప్రవేశం పూర్తిగా ఉచితం కాగా, వేలాది మంది సందర్శకులు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
దాదాపు ఐదు దశాబ్దాల చరిత్ర కలిగిన ఆనంద్ బజార్ ఉత్తర టెక్సాస్లో భారతీయ సంస్కృతి, ఐక్యత, వైవిధ్యాన్ని ప్రతిబింబించే ప్రతిష్ఠాత్మక ఉత్సవంగా గుర్తింపు పొందింది.











