పంచతంత్రములలో మొదటి భాగమైన మిత్రలాభం పూర్తిగా వివరించి చెప్పిన తరువాత విష్ణుశర్మ రాకుమారులకు మిత్రభేదతంత్రాన్ని వివరించసాగాడు. "రాకుమారులారా! ఇది మీరు జాగ్రత్తగా వినండి. స్నేహితుల మధ్య విరోధాన్ని కల్పించి వారిని విడగొట్టడాన్ని "మిత్రభేదం" అంటారు. బలవంతులిద్దరు కలిసి మిత్రులుగా ఉంటే వారి మైత్రికి భంగం కల్గించి తమ అవసరాన్ని సాధించుకోవడానికి బుద్ధిమంతులీతంత్రాన్ని ఉపయోగిస్తారు.
పూర్వం రామాపురం అనే పట్టణం ఉంది. ఆ పట్టణంలో వర్ధమాను అనే వ్యాపారి ఒకడుండేవాడు. అతడు ఇరుగు పొరుగున ఉన్న పట్టణాలకు పోయి వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. సరుకులన్నీ బండ్ల మీద వేసుకొని మరొక నగరానికి వెళ్లుచున్నాడు. అతడెక్కిన బండికి సంజీవకము, నందకము అను రెండు బలిసిన ఎడ్లు కట్టబడ్డాయి. ఆ అడవిదారిలో బండికి కట్టబడిన రెండు ఎద్దులలో సంజీవకం అనే ఎద్దు కాలు మడతపడి బెణికింది. ఆ కారణంతో సంజీవకం నడవలేక కింద పడింది.
అపుడు వర్తమానుడు "నా ఎడ్లలో ఇది చాలా మంచిది. ఎన్నాళ్ళనుండియో నా వద్ద నమ్మకంగా పనిచేసింది. ఎవరికి ఎపుడు ఏ గతి కలుగుతుందో చెప్పలేము. దీనికి అడవిపాలు కావలిసి ఉంది కాబోలు! ఏం చేస్తాం ఈ పక్కనున్న పల్లెటూళ్ళో మంచి ఎద్దునొకదాన్ని కొనుక్కుని రండి" అని నౌకర్లను పంపించి ఇంకొక ఎద్దును తెప్పించుకొనితన బండికి కట్టుకొని, సంజీవకమును ఆ అడవిలోనే వదిలి తన దారిన తాను వెళ్ళిపోయాడు. రెండు మూడు రోజులు గడిచిన తరువాత సంజీవకం మెల్లగా లేచి కుంటుతూ ఆ అడవిలో పచ్చిక పుష్కలంగా దొరికే చోటికి వెళ్లి బాగా మేస్తూ అదృష్టం బాగుండి ఏ క్రూరమృగాల నోటపడకుండా తప్పించుకుంటూ, కాలు బాగుపడి క్రమక్రమంగా కోలుకుంటుంది.
ఒకనాడు అది మేఘం ఉరిమినంత పెద్దగా అడవంతా మారుమ్రోగేలా రంకేసింది. ఆ రంకె విని పక్షులు పారిపోయాయి. జంతువులు హడలిపోయాయి. భూమి అదిరింది. అదే సమయంలో అక్కడికి సమీపంలో ఉన్న మడుగులో నీరు త్రాగాలని వస్తున్న "పింగళకము" అనే సింహం ఆ శబ్దాన్ని విన్నది. దాని గుండెలు దడదడా కొట్టుకున్నాయి. వెంటనే మూర్చపోయి, కొంతసేపటికి తెప్పరిల్లింది. పింగళకం ఆ అడవిలో మృగాలన్నింటికీ రాజు. అది తన మనసులో "నా అంత ధైర్యశాలికే భయం పుట్టేలా అరచిన జంతువు ఏ జాతికి చెందినదో, ఎక్కడ నుండి ఇక్కడకు వచ్చినదో. ఇంతకు మునుపెన్నడూ ఇలాంటి శబ్దం వినలేదు. గుండె దద్దరిల్లేలా అరిచిన ఆ జంతువెంత పెద్దదో!" అని తలిచి గడగడ వణుకుతూ ముందుకు అడుగు పడక అక్కడే నిలబడింది.
పింగళకుని వద్దవిచిత్రుడు అనే నక్క మంత్రి ఉన్నాడు. మంత్రికి ఇద్దరు కుమారులున్నారు. వారు "కరటకుడు, దమనకుడు" అను పేర్లు గల రెండు నక్కలు. వారిద్దరూ రాజుగారి అవస్థ చూచి, తమకు కూడా ఎంతో భయం కలిగినా ధైర్యం తెచ్చుకొని నెమ్మదిగా ఒక మూల నక్కినారు. అపుడు దమనకుడు కరటకునితో "ఒరే కరటకా! మన రాజు చూడు ఎలా వణుకుతున్నాడో! మనం తిన్నగా ఆయన దగ్గరకుపోయి ధైర్యం చెప్పి భయాన్ని పోగొట్టి ఆయన అభిమానం సంపాదిద్దాము" అన్నాడు.
అందుకు కరటకుడు "మనకెందుకురా! పిలువని పేరంటం! చెప్పని ఒక్క పొద్దు మనం ఆయనకు నౌకర్లము కాము కదా! ఆయన దయ వల్ల బతికే సేవకులెంతో మంది ఉన్నారు. ఆయన మంచీ చెడులు చూడాల్సిన పని వాళ్ళది. దారిన పోయే శనిని ఎవరైనా తెచ్చి తలపై పెట్టుకుంటారా? అక్కడక్కడా దొరికే ఆహారం కడుపునిండా తిని హాయిగా పడి ఉండక మనకెందుకు వచ్చిన గొడవ? పిలువని పేరంటానికి పోనేకూడదు. పోయినచో చెక్కముక్క పీకిన కోతిలాగా చచ్చిపోతాము. ఆ కథ చెబుతాను జాగ్రత్తగా విని అని కథ చెప్పడం ప్రారంభించింది.








