
హైదరాబాద్: కేంద్రమంత్రి కుమారుడిని లక్ష్యంగా చేసుకొని జరిగిన హనీట్రాప్, ఎక్స్టార్షన్ (వసూళ్ల) ప్రయత్నం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ వ్యవహారానికి సంబంధించిన ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి. "కోర్టు" సినిమా కథను ఆదర్శంగా తీసుకొని లేని "పోక్సో" కేసు ఆపాదించి కేంద్ర మంత్రి కొడుకును బ్లాక్ మెయిల్ చేసే కుట్ర బయట పడింది. ఒక మహిళ తన కూతురిని అడ్డుపెట్టుకొని కేంద్రమంత్రి కుమారుడిని హనీట్రాప్లోకి దించే ప్రయత్నం చేసింది. పక్కా పథకం ప్రకారం వ్యవహరించిన సదరు మహిళ, ఆ తర్వాత భారీగా డబ్బులు డిమాండ్ చేస్తూ బ్లాక్మెయిల్కు దిగింది. ఈ వేధింపులు, బెదిరింపులు ఎక్కువ కావడంతో కేంద్ర మంత్రి కుమారుడు సదరు మహిళపై కరీంనగర్లో ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు రెండు నుండి మూడు కోట్ల రూపాయలు వసూలు చేయాలని, తనను లొంగదీసుకోవాలని చూస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
సదరు మహిళ తన కుమార్తె వయస్సును తప్పుగా చూపిస్తూ ఈ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది. మైనర్ అమ్మాయిని వేధించారని "పోక్సో" కేసు పెడతా అంటూ మీడియా ద్వారా రచ్చ చేస్తూ భయాందోళనకు గురిచేసే ప్రయత్నం చేస్తోంది. డబ్బులు ఆశించిన మేరకు రాకపోవడంతో, సదరు మహిళ మీడియాను ఆశ్రయించి ఈ వ్యవహారాన్ని వివాదాస్పదం చేస్తోంది. కేవలం రాజకీయంగా, ఆర్థికంగా ప్రయోజనం పొందేందుకే ఈ హనీట్రాప్ డ్రామా ఆడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం పోలీసుల దర్యాప్తులో ఉంది. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు ఈ "చలాకీ" మహిళా కార్యకలాపాలతో పాటు గతంలో ఆమె ఎలాంటి నేరాలకు పాల్పడింది అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.














