9, 10 తరగతులకు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ

2026 జూన్ 1 నుంచి అమలులోకి

మూడు భాషలలో రెండు భారతీయ భాషలు తప్పనిసరి

మూడో భాషకు బోర్డు ఎగ్జామ్ నుంచి మినహాయింపు

స్కూల్ స్థాయిలోనే ఇంటర్నల్ ఎగ్జామ్

దీనిలో ఉత్తీర్ణత తప్పనిసరి,  విదేశీ భాష ఆప్షన్ మాత్రమే

జాతీయ విద్యావిధానంలో భాగంగా కీలక నిర్ణయం

న్యూఢిల్లీ : సిబిఎస్‌ఇ త్రిభాషా విధానాన్ని తప్పనిసరి చేసింది. ఈ మేరకు శనివారంనాడు ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ స్కూళ్ల భాషా విధానంలో ఈ ఏడాది జులై 1 నుంచి 9, 10 తరగతుల విద్యార్థులకు మూడు భాషల సూత్రం వర్తించనుంది. కొత్త నిబంధన ప్రకారం విద్యార్థులు చదవాల్సిన మూడు భాషల్లో కనీసం రెండు కచ్చితంగా ప్రాంతీయ భారతీయ భాషలై ఉండాలి. ఒకవేళ విద్యార్థులు ఫ్రెంచ్, జర్మన్ వంటి విదేశీ భాషలను అభ్యసించాలనుకోవాలని భావిస్తే మిగిలిన రెండు భాషలు భారతీయ భాషలైనప్పుడు మాత్రమే దానికి అనుమతి ఉంటుంది. అయితే మూడు భారతీయ భాషలను ఎంచుకున్నప్పటికీ విదేశీ భాషను అదనంగా నాలుగో భాషగా ఎంపిక చేసుకునే వెసులుబాటును కూడా కల్పించారు.

ఇక విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు గానూ ఈ నూతన విధానంలోని మూడో భాషకు 10వ తరగతిలో బోర్డు పరీక్ష ఉండదు. స్కూల్ స్థాయిలోనే ఇంటర్నల్ అసెస్‌మెంట్ ద్వారా దీనికి మార్కులు లేదా గ్రేడులు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే దీనిలో మాత్రం ఉత్తీర్ణులు కావడం తప్పనిసరి అని సర్కులర్‌లో సిబిఎస్‌ఇ పొందుపరిచింది. జాతీయ విద్యా విధానం2020, నేషనల్ కరిక్యులం ఫ్రేమ్‌వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్2023 సూచనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వెల్లడించింది. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ ఎన్‌సిఇఆర్‌టి విడుదల చేసిన నూతన సిలబస్‌ను సమీక్షించిన తర్వాతే ఈ మార్పులు చేసినట్లు బోర్డు స్పష్టం చేసింది.