పూర్వం సముద్రతీరాన గల చెట్టు మీద తీతువు పిట్టల జంట నివశిస్తూ ఉండేది. సముద్రంలోని అలలు పెద్ద ఎత్తున వచ్చి చెట్టుపై ఉన్న ఆ పక్షి గుడ్లను మింగేయసాగాయి. అపుడు ఆడ తీతువు పక్షి భర్తను చూచి "నాధా! ఈ సముద్రుడు మన చెట్టు కన్నా ఎత్తుగా పొంగి మన గుడ్లను పొట్టన పెట్టుకుంటున్నాడు. ఇచట నివశించటం మనకు క్షేమం కాదు. మరొక చెట్టుపైకి పోదాం" అన్నది.
మగతీతువు పక్షి "పిచ్చిదానా! మన రాజు గరుత్మంతుల వారు. ఆయన విష్ణు దేవుని వాహనము. పక్షి కులాన్ని రక్షించటం ఆయన విధి. అందువలన ఆయనను వేడుకొన్నామంటే వెంటనే వచ్చి మనకు సహాయం చేస్తాడు. ఆయన బలం ముందు సముద్రుడెంత? నీవేమీ విచారించకు" అని చెప్పాడు. అపుడు ఆడతీతువు పక్షి హితుల మాటలు విని మూర్ఖులవుతారు. "కర్ర విడిచి నేల పడిన తాబేలు" వలే చనిపోతారు. నీకా కథ చెపుతాను విను ఈ కథ చెప్పటం ప్రారంభించింది.
హంసలు-తాబేలు కథ
పూర్వం ఒక కొలనులో "కంబుగ్రీవం" అనే తాబేలు, వికటము, సంకటము అనే రెండు హంసలు ఎంతో స్నేహంగా ఉండేవి. ఎండాకాలం సమీపించింది. హంసలు తాబేలుతో "మిత్రమా! ఈ కొలను మెల్లమెల్లగా ఎండిపోతుంది. కాబట్టి మేము వేరొక సరస్సునకు పోతలచాము" అన్నాయి. తాబేలు బాధతో "ఇదేమి అన్యాయము, ఇన్నాళ్ళుగా మీతో స్నేహం చేసిన నన్ను ఒంటరిగా ఒదిలి మీరు వెళ్ళిపోవడం ధర్మమేనా? మిమ్ములను చూడకుండా ఒక్కరోజైనా బతకగలనా! ఎలాగైనా మీతో పాటు నన్ను కూడా తీసుకొని పొండి" అని బతిమాలింది.
హంసలు ఒక ఉపాయం ఆలోచించి, ఒక పుల్లను తెచ్చి అవి తాబేలుతో మిత్రమా! నీవు ఈ కర్రను నోటితో కరుచుకొని ఉండుము. మేమిద్దరం చెరొక కొనను మా ముక్కులతో పట్టుకొని పైకెగిరెదము. మా మధ్యలో నీవునూ మాతోపాటు ఆకాశంలో పయనించి మరొక సరస్సుకు చేరుకోగలవు. మేము చెప్పేవరకు నోరు తెరవవద్దు అని చెప్పాయి. అందుకు తాబేలు సంతోషంతో అలాగే అంది. బయలుదేరే ముందు హంసలు తాబేలుతో "మిత్రమా! మార్గంలో ఎన్నో పల్లెలు, పట్నాలు వస్తాయి. ఆకాశంలో వెళుతున్న మనల్ని చూసి జనం గోల చేస్తారు, పిల్లలు కేరింతలు కొడతారు. నోటికి వచ్చినట్లు ఏవేవో మాట్లాడతారు. నీవు మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ నోరు తెరవవద్దు. తెరిచావో కర్ర నుండి విడిపోయి కిందపడి చచ్చిపోతావు" అని మరొకమారు గుర్తుచేసాయి.
ఆ హెచ్చరికలను తప్పక పాటిస్తాను అని తాబేలు కర్రను నోట కరిచి గట్టిగా పట్టుకుంది. హంసలు ఆ పుల్లను అటూ ఇటూ తమ ముక్కులతో పట్టుకొని ఆకాశానికి ఎగిరాయి. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక గ్రామం వచ్చింది. ఈ వింతని చూచిఆ ఊళ్ళోని పిల్లలూ, పెద్దలూ పెద్దగా అరిచి గోల చేయడం మొదలు పెట్టారు. కొందరు ఈలలు వేస్తున్నారు. తాబేలు ఆకాశంలో ఎగురుతుంది అని హేళన చేయసాగారు. మరికొందరు వెంటపడుతున్నారు.
తాబేలుకు ఆత్రం పెరిగిపోతుంది. ఆ తొందరలో అది హంసలు చేసిన హెచ్చరికను మరిచిపోయింది. కింద ఆ కోలాహలమేమి అని హంసలను అడగబోయి నోరు తెరిచింది. వెంటనే కర్రనుండి విడిపోయి దభీమని కిందపడి మరణించింది. లోకంలో మూడు రకాల మనుషులుంటారు. సొంతగా ఆలోచించుకొనేవారు, రెండూ లేక చెడేవారు. తమకు తెలియక, ఒకరు చెపితే వినక ఉండేవారినే మూర్ఖులంటారు. అలాంటి మూర్ఖులు తాబేలులాగా ప్రవర్తించి చెడిపోతారు. "పూర్వం ఒక చేప తన మిత్రుని మాట వినక ప్రాణం పోగొట్టుకుంది" అని అనగామగతీతువుపక్షి ఆ చేప కథ ఏమిటో చెప్పు అన్నది. ఆడతీతువు పక్షి ఆ కథ చెప్పడం ప్రారంభించింది.








