
హైదరాబాద్: కష్టపడి చదివిన ఎంతోమంది విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. ఎన్డిఎ ప్రభుత్వానికి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడం చేతకావడం లేదని అన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ..ఎన్డిఎ ప్రభుత్వ వైఫల్యం వల్లే మరోసారి పేపర్ లీకైందని, 2024 లోనూ నీట్ ప్రశ్నాపత్రం లీకైన ఉదంతం నుంచి గుణపాఠం నేర్చుకోలేదని విమర్శించారు. పరీక్ష నిర్వహణలో వరుసగా వెలుగుచూస్తున్న ఘటనలు విద్యార్థులకు శాపంగా మారాయని, వందకు పైగా ప్రశ్నలు పరీక్షకు ముందు రోజే లీక్ కావడం దారణమని కెటిఆర్ మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది నీట్ పరీక్ష రాసిన దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కేంద్ర సర్కారు తీవ్ర మానసిక క్షోభకు గురిచేసిందని ధ్వజమెత్తారు. పరీక్ష పేపర్ లీకేజ్ వెనుక ఎంత పెద్దవాళ్లు ఉన్నా కఠినంగా శిక్షించాలని, సాధ్యమైనంత త్వరగా మళ్లీ నీట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కోరారు. పేపర్ లీకేజీకి కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కేంద్రప్రభుత్వం క్షమాపణ చెప్పాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.













