రాష్ట్రంలో రేవంత్ సర్కార్

కొలువుదీరి రేపటికి వెయ్యి

రోజులు కొత్త బాటలో

సంక్షేమం, సామాజిక

న్యాయం పెట్టుబడులు,

మౌలిక వసతులపై ప్రభుత్వం

దృష్టి రైతులు, మహిళలు,

యువతకు ప్రాధాన్యం

రూ.5.75లక్షల కోట్ల

పెట్టుబడి ఒప్పందాలు

వైద్య రంగంలో విస్తరణ

హైదరాబాద్ కేంద్రంగా

భారీ అభివృద్ధి ప్రణాళికలు

3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక

వ్యవస్థే లక్షం రాష్ట్ర

ప్రభుత్వం ప్రకటన

మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సా రథ్యంలో ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్1వ తేదీ నాటికి విజయవంతంగా వెయ్యి రోజుల పాలనను పూర్తి చేసుకుంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనను పునర్నిర్మించడం, సం క్షేమాన్ని విస్తరించడం, సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇ వ్వడం, రైతులు-,మహిళలు, -యువతకు భరోసా కల్పించడం, పెట్టుబడులను ఆకర్షించడం, ప్రపంచస్థాయి మౌలిక వసతుల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ కాలంలో చేపట్టిన వివిధ కార్యక్రమాలతో తెలంగాణ అభివృద్ధికి కొత్త దిశ ఏర్పడిందని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.

రూ.4.18 లక్షల తలసరి ఆదాయం

2025- 26లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరిందని ప్రభుత్వం పేర్కొంది. దేశ తలసరి ఆదాయం కంటే ఇది దాదాపు 91 శాతం అధికమని తెలిపింది. సంక్షేమంతో పాటు పెట్టుబడులు, ఉపాధి, మౌలిక వ సతులు, సాంకేతిక రంగాల విస్తరణకు ప్రాధాన్యం ఇచ్చినట్లు వెల్లడించింది. రైతులకు రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీ చేపట్టడంతో 25 లక్షలకుపైగా రైతు కుటుంబాలకు రు ణభారం నుంచి విముక్తి కలిగిందని ప్రభుత్వం తెలిపింది. రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లకుపైగా పెట్టుబడి సా యం అందించినట్లు పేర్కొంది.

ఒకే విడతలో తొమ్మిది రోజుల్లో దాదాపు రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపింది. సన్నవడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, రైతుబీమాతో భరోసా కల్పించినట్లు పేర్కొంది. గత 32 నెలల్లో వ్యవసాయం, రైతు సంక్షేమానికి దాదాపు రూ.1.68 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది. గత యాసంగిలో 81.12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి కొత్త రికార్డు సాధించినట్లు తెలిపింది.

మహిళల చేతిలో ఆర్థిక చోదకశక్తి

మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రభుత్వం ఆర్‌టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది. ఇప్పటివరకు 335 కోట్లకుపైగా ఉచిత ప్రయాణాలు జరిగాయని, మహిళలకు దాదాపు రూ.11 వేల కోట్ల ప్రయాణ వ్యయం ఆదా అయిందని ప్రభుత్వం పేర్కొంది. గృహజ్యోతి కింద 53 లక్షలకుపైగా కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 43 లక్షల కుటుంబాలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నట్లు తెలిపింది. 4.54 లక్షల మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.60,487 కోట్ల రుణాలు, రూ.1,900 కోట్ల వడ్డీ రాయితీ అందించినట్లు పేర్కొంది. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో మహిళా సంఘాలకు కొత్త వ్యాపార అవకాశాలు కల్పిస్తున్నట్లు వెల్లడించింది.

పేదలకు రేషన్.. ఇళ్లకు చేయూత

15 లక్షలకుపైగా కొత్త రేషన్ కార్డులు జారీ చేసి, దాదాపు 3.38 కోట్ల మందికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార భద్రత కల్పిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సన్నబియ్యం పంపిణీ, స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చే చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. కొత్తగా 2.25 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేయడంతో మొత్తం 43 లక్షలకుపైగా అర్హులకు సామాజిక భద్రతా పింఛన్లు అందుతున్నాయని తెలిపింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం తొలి దశలో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. అర్హత ఉన్న కుటుంబాలకు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సాయం అందించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.హైదరాబాద్ క్యూర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించింది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది. 59 ఎస్‌సి ఉపకులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించి ఎస్‌సి వర్గీకరణను అమలు చేసిన దేశంలోని తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని పేర్కొంది. బిసిలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది. కనీస వేతనాల సవరణతో దాదాపు కోటి 11 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం కలిగిందని తెలిపింది.

ఉద్యోగాలు.. నైపుణ్యాలకు ప్రాధాన్యం

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి వెయ్యి రోజుల్లో 72 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. గ్రూప్- 1 నుంచి డిఎస్‌సి వరకు నియామకాలు పూర్తి చేసినట్లు పేర్కొం ది. మరోవైపు టిజిపిఎస్‌సి ద్వారా 456 పోస్టులు, పోలీసు నియామక బోర్డు ద్వారా 7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసినట్లు తెలిపింది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో 1,190 మంది శిక్షణ పూర్తి చేయగా..838 మందికి ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు లభించినట్లు వెల్లడించింది. 65 ఐటీఐలు, 57 పాలిటెక్నిక్ కళాశాలలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపింది.

వైద్య రంగంలో విస్తరణ

రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు ప్రభుత్వం పేర్కొంది. గోషామహల్లో రూ.2,700 కోట్లతో 2 వేల పడకల నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం, సనత్‌నగర్, అల్వాల్, ఎల్‌బి నగర్‌లో మూడు టిమ్స్ ఆసుపత్రుల ఏర్పాటు, తొమ్మిది కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, మరో 17 కాలేజీల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు తెలిపింది. 2023 డిసెంబరు 7 నుంచి 2026 ఆగస్టు 12 వరకు సీఎంఆర్‌ఎఫ్ ద్వారా 5,18,186 మందికి రూ.2,526.12 కోట్ల సాయం అందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

హైదరాబాద్ చుట్టూ భారీ ప్రణాళికలు

హైదరాబాద్ చుట్టూ దాదాపు 360 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు, రాష్ట్రవ్యాప్తంగా 6,092 కిలోమీటర్ల హ్యామ్ రోడ్ల ప్రణాళికను ప్రభుత్వం ప్రకటించింది. మెట్రో రెండో దశలో ఏడు కారిడార్లతో 122.9 కిలోమీటర్ల విస్తరణకు చర్యలు చేపట్టింది. మూసీ పునరుజ్జీవనంలో 55 కిలోమీటర్ల మేర సమగ్ర అభివృద్ధి, 39 కొత్త ఎస్‌టిపిల ఏర్పాటు, గోదావరి నుంచి 2.5 టిఎంసిల స్వఛ్చమైన నీటిని మూసీకి తరలించే ప్రణాళికను వెల్లడించింది.

పెట్టుబడులకు భారీ ఊతం

తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో భాగంగా టిజి-ఐపాస్ ద్వారా రూ.1.29 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్- 2025లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు కుదిరినట్లు పేర్కొంది. టిజిఐఐసి భూముల్లో రూ.92,281 కోట్ల పెట్టుబడులకు మార్గం ఏర్పడిందని, 78 వేలకుపైగా ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉందని తెలిపింది. 2025 -26లో రాష్ట్ర ఐటీ ఎగుమతులు రూ.3.97 లక్షల కోట్లకు చేరాయని, ప్రత్యక్ష ఐటీ ఉద్యోగాలు 12.14 లక్షలకు పెరిగాయని ప్రభుత్వం పేర్కొంది. హైదరాబాద్‌లో 355కుపైగా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు ఉన్నాయని తెలిపింది. 2026లోనే మరో 40 కేంద్రాలు హైదరాబాద్‌ను ఎంచుకున్నట్లు పేర్కొంది. అమెజాన్ నుంచి తెలంగాణకు అదనంగా 7 బిలియన్ డాలర్ల పెట్టుబడి రానుందని, దేశంలో తొలి స్టేట్ ఏఐ డేటా ఎక్స్‌ఛేంజ్‌టిజిడెక్స్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.

మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం

వెయ్యి రోజుల పాలనలో వేసిన పునాదులపై భవిష్యత్తు తెలంగాణ నిర్మాణానికి ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించింది. 2034 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్ ఫ్యూచర్ సిటీని దేశంలో తొలి నెట్-జీరో స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడం, ఏఐ సిటీ, డేటా సెంటర్లు, రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవనం వంటి ప్రాజెక్టులతో భవిష్యత్తు తెలంగాణకు బలమైన పునాదులు వేయాలని ప్రభుత్వం సంకల్పించింది.