
హైదరాబాద్: ఎపి ప్రభుత్వం కృష్ణా జలాలు బేసిన్ దాటి యధేచ్ఛగా తరలిస్తోందని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఎపి చేస్తున్న కృష్ణా జలాల దోపిడీపై సిఎం రేవంత్ రెడ్డి మౌనం మనకు తీరని ద్రోహమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..వెలిగొండ ద్వారా కృష్ణా జలాలు దోచుకుంటే సిఎం చోద్యం చూస్తున్నారని, తెలంగాణ ప్రాజెక్టులు ఎండిపోతుంటే..బేసిన్ దాటి ఎపికి నీళ్ల తరలింపు జరుగుతుతుందని హరీష్ రావు విమర్శించారు. మూల్యాల, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు ఎపికి తరలిస్తారని, ఇప్పుడు వెలిగొండ ద్వారా మన వాటా తరలిస్తుంటే రేవంత్ రెడ్డి నోరెత్తట్లేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఎపికి పరోక్షంగా ఎందుకు సహకరిస్తున్నారని, పర్యవేక్షించాల్సిన కెఆర్ఎంబి కూడా పట్టనట్లు వ్యవహరించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. కెఆర్ఎంబి వైఖరిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెంటనే స్పందించాలని హరీష్ రావు కోరారు.








