మంచిర్యాల: తల్లికి ఎంత కష్టము వచ్చిందో ఏమోకానీ కూతురును నడుముకు కట్టుకొని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వేనుగుమట్ల గ్రామంలో గొట్ల అంజయ్య, రజిత(26) అనే దంపతులు నివసించేవారు. ఈ దంపతులకు కూతురు అక్షిత(06), కుమారుడు మహేందర్(2) ఉన్నారు. దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరగడంతో రజిత తన పుట్టింటికి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు వద్ద ఉంటూ జీవనం సాగిస్తోంది. అప్పుడప్పుడు అంజయ్య తన పిల్లలు చూసుకొని వెళ్తూ ఉండేవాడు. ఆదివారం కూడా అంజయ్య అత్తింటికి వచ్చి పిల్లలను యోగక్షేమాలు అడిగి తెలుసుకొని వెళ్లిపోయాడు. తరువాత కుమారుడిని ఇంట్లో పడుకోబెట్టి కూతురును తీసుకొని గ్రామ సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లింది. కూతురును నడుముకు కట్టుకొని బావిలో దూకింది. బావిలో మృతదేహాలు కనిపించడంతో రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.