అంగారక గ్రహంపై జీవం ఉనికి గురించి దశాబ్దాలుగా సాగుతున్న అన్వేషణలో నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ మరో కీలక ముందడుగు వేసింది. క్యూరియాసిటీ రోవర్ అంగారకుడి భూమధ్యరేఖకు సమీపంలో ఒకప్పుడు సరస్సుగా ఉండి ఎండిపో యిన ప్రాంతంలో క్యూరియాసిటీ రోవర్ ఈ పరిశోధన జరిపింది. ఇక్కడ ఏడు వేర్వేరు సేంద్రియ సమ్మేళనాలను రోవర్ గుర్తించగా, వాటిలో ఐదింటిని మార్స్‌పై కనుగొనడం ఇదే తొలిసారి. ఈ సేంద్రియ పదార్థాలు పురాతన జీవుల నుంచి వచ్చాయా?ఉల్కల ద్వారా గ్రహానికి చేరాయా? లేక భౌగోళిక ప్రక్రియల వల్ల ఏర్పడ్డాయా? అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, ఒకవేళ అంగారకుడిపై జీవం ఉండి ఉంటే, దానికి సంబంధించిన రసాయన ఆనవాళ్లు ఇప్పటికీ భద్రంగా ఉండే అవకాశం ఉందని ఈ ఆవిష్కరణ సూచిస్తోంది. ఈ ప్రయోగానికి నేతృత్వం వహిం చిన ఫ్లోరిడా యూనివర్సిటీ ఆస్ట్రోజియాలజిస్ట్ ప్రొఫెసర్ అమీ విలియమ్స్ మాట్లాడుతూ ‘మేము 350 కోట్ల సంవత్సరాల క్రితం అంగారకుడిపై భద్రపరచబడిన సేంద్రియ పదార్థాలను చూస్తున్నామని భావిస్తున్నాం.

అయితే ఇది జీవానికి సంబంధించినదేనా? అన్నది ప్రస్తుత సమాచారంతో చెప్పలేం‘ అని వివరించారు. కొన్ని వందల కోట్ల ఏళ్ల కిందట మార్స్‌పై జీవం వృద్ధి చెందడానికి అనువైన వాతావరణం ఉండేదని, కానీ నేడు తీవ్రమైన రేడియేషన్, అతి శీతల పరిస్థితులు ఉన్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ‘ఇంతటి కఠినమైన రేడియేషన్ వాతావరణంలో సేంద్రియ పదార్థాలు మనుగడ సాగించడం నిజంగా ఆశ్చర్యకరం‘ అని అమీ విలియమ్స్ అన్నారు. గుర్తించిన సమ్మేళనాల్లో డీఎన్‌ఏ నిర్మాణంలో పాలుపం చుకునే నైట్రోజన్ సమ్మేళనం వంటి నిర్మాణం ఒకటి ఉన్నప్పటికీ, అవి కేవలం ‘ఇటుకలు మాత్రమే, ఇల్లు కాదు‘ అని ఆమె స్పష్టం చేశారు. ఈ ఆవిష్కరణలతో 2028లో ప్రయోగించనున్న యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన రోసలిండ్ ఫ్రాంక్లిన్ రోవర్‌పై అంచనాలు పెరిగాయి. ఈ రోవర్ ఉపరితలం కింద రెండు మీటర్ల లోతు వరకు డ్రిల్ చేసి, రేడియేషన్ నుంచి మరింత సురక్షితంగా ఉన్న నమూనాలను విశ్లేషించగలదు.