
అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) వలకు మరో అవినీతి చేప చిక్కింది. లంచం తీసుకుంటూ ఓ అధికారి రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. సోమవారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలో ఎసిబి అధికారులు మెరుపు దాడి నిర్వహించారు. రూ. 10 వేలు లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ భర్త ఎసిబి అధికారులకు చిక్కారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఎసిబి అధికారుల కథనం ప్రకారం.. కొమురవెల్లి గ్రామానికి చెందిన ఫిర్యాదుదారుడి ప్లాట్లో గ్రామ పంచాయతీ వారు డ్రైనేజీ పైప్లైన్ వేశారు. ఆ పైప్లైన్ను అక్కడ నుంచి తొలగించాలనే అధికారిక పని కోసం పంచాయతీ కార్యదర్శి గడ్డం రాజు గౌడ్ పది వేల రూపాయల లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఎసిబిని ఆశ్రయించడంతో పక్కా ప్రణాళికతో అధికారులు పట్టుకున్నారు.
సర్పంచ్ భర్త ద్వారా నగదు స్వీకరణ
సోమవారం సాయంత్రం 4.40 గంటల సమయంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే లంచం డబ్బులు తీసుకుంటుండగా అధికారులు దాడి చేశారు. పంచాయతీ కార్యదర్శి ఆదేశాల మేరకు సర్పంచ్ గొల్లపల్లి పద్మ భర్త గొల్లపల్లి అంజనేయులు.. ఆ పది వేల రూపాయలను స్వీకరించారు. ఎసిబి అధికారులు వారిద్దరినీ పట్టుకుని, లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.
కాగా, విధి నిర్వహణలో అవినీతికి పాల్పడి, అనుచిత లబ్ధి పొందేందుకు ప్రయత్నించినందుకు గాను పంచాయతీ కార్యదర్శి రాజు గౌడ్, సర్పంచ్ భర్త అంజనేయులును అధికారులు అరెస్టు చేశారు. వారిని హైదరాబాద్లోని ఎసిబి ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసుపై ప్రస్తుతం తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.











