సీనియర్ ఐపిఎస్ అధికారిణి శిఖా గోయల్ శుక్రవారం రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. అదే సమయంలో ఆమె సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(ఎఫ్‌ఎస్‌ఎల్) డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను కొనసాగించనున్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ సంబంధిత శాఖాధిపతులు ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ హోం శాఖ పరిధిలోని పోలీస్, జైళ్లు, అగ్నిమాపక సేవలు, ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్ వంటి వివిధ సంస్థలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. సైబర్ నేరాలు, ఫోరెన్సిక్ సైన్స్ రంగాల్లో విశేష అనుభవం ఉన్న శిఖా గోయల్ నియామకం హోం శాఖలో సాంకేతిక ఆధారిత పరిపాలనకు దోహదపడుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.