
హైదరాబాద్: ఆర్టిసి కార్మికుల జీవితాలతో యాజమాన్యం, సిఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఆడుకుంటుందని బిఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. రేవంత్ సర్కార్ మెడలు వంచి డిమాండ్లను సాధించుకుందామని అన్నారు. ఆర్టిసి కార్మికుల నిరసనలో సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టిసి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సూచించారు. ఆర్టిసి కార్మికులను విధుల్లోకి రావాలని ఎండి బెదిరిస్తున్నారని, ఆర్టిసిని ప్రైవేటు పరం చేసేందుకు సర్కార్ యత్నిస్తోందని విమర్శించారు. ఆర్టిసి కార్మికులకు బిఆర్ఎస్ అండగా ఉంటుందని, కేబినెట్ భేటీలో ఆర్టిసి కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపాలని అన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ వ్యక్తులతో కాకుండా ఆర్టిసి డైవర్లతో నడిపించాలని సూచించారు. ఆర్టిసి కార్మికులను రోడ్డున పడేస్తే మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని, ఆర్టిసి కార్మికుల డిమాండ్లు నెరవేర్చకపోతే సచివాలయం ముట్టడిస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.














