
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కార్మిక కర్షక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ఉత్పత్తి రంగంలో భాగమై దేశ సంపదను సృష్టిస్తున్న కార్మికుల రెక్కల కష్టం, వారి త్యాగాలు అమూల్యమైనవని కొనియాడారు. చారిత్రాత్మక మే డే స్ఫూర్తితో బిఆర్ఎస్ ప్రభుత్వం, సబ్బండ కులాల కర్షక కార్మికుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను, ఆదర్శవంతమైన పారిశ్రామిక విధానాలను అమలు చేసిందని అన్నారు.
సింగరేణి, ఆర్టిసి, భవన నిర్మాణ రంగం సహా పలు రంగాలకు చెందిన కార్మికులు, ఆటో డ్రైవర్లు, దినసరి కూలీలు, అసంఘటిత రంగ కార్మికుల కోసం గత బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కెసిఆర్ గుర్తు చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వినూత్న పారిశ్రామిక విధానాల ద్వారా తెలంగాణలో సంపద సృష్టించడంతో లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభించాయని కెసిఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. నాటి పదేండ్ల ప్రగతి కార్యాచరణను మరింత పటిష్టంగా అమలుచేయడమే రాష్ట్ర కార్మిక లోకానికి మనమిచ్చే గొప్ప కానుక అని కెసిఆర్ స్పష్టం చేశారు.










