మెదక్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. జిల్లాలోని కొల్చారం దగ్గర వేగంగా దూసుకొచ్చిన ఆర్టీసి సూపర్ లగ్జరీ బస్సు అదుపుతప్పి, ధాన్యం లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది. ఈ ఘటనలో దాదాపు ౩౦ మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఆర్టీసి బస్సు.. హైదరాబాద్ నుండి మెదక్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.