నిజామాబాద్: ఉదయం కుమారుడి పెళ్లి చేసి అనంతరం రాత్రి తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లా నవీపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నందిగామ గ్రామంలో ఎల్కా దేవన్న-సాయమ్మ అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. దేవన్నకు వందకు పైగా మేకలు ఉన్నాయి. మేకలు కాపరిగా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కూతురు పెళ్లి కోసం 30 మేకలను అమ్మాడు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం అంకోల్‌కు చెందిన యువకుడికి కూతురు ఇచ్చి పెళ్లి చేశాడు. అనంతరం తన బంధువులతో కలిసి ఇంటికి తిరిగొచ్చాడు. ఇంటి ముందు మేకల మంద తగ్గిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. వెంటనే తన రూమ్‌లోకి వెళ్లి ఉరేసుకొని చనిపోయాడు. దేవన్న ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. సాయమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.