చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చిదంబరం స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఒంటరి పోరాటం చేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ చెన్నైని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై టాపార్డర్ గుజరాత్ బౌలర్ల ధాటికి కుప్పకూలిపోయింది. 37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రుతురాజ్ గైక్వాడ్ అండగా నిలిచాడు. బౌలర్లను ఎదురుకుంటూ పరుగులు రాబట్టాడు. 49 బంతుల్లో అర్థ శతకం సాధించాడు. మరోవైపు వికెట్లు పడుతున్నా తను మాత్రం పకడ్బందీగా బ్యాటింగ్ చేశాడు. 60 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 74 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. గుజరాత్ బౌలింగ్‌లో రబాడా 3, అర్షద్ 2, సిరాజ్, సుతార్ తలో వికెట్ తీశారు.