బంగారం ధరలు రాకెట్ వేగంతో పెరుగుతున్న వేళ తమిళనాడులో జువెలర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మార్కెట్‌లో కలకలం రేపేలా 30 వేల మందికి పైగా జువెలర్లు కీలక మార్పులకు సిద్ధమయ్యారు.

తమిళనాడులో సుమారు 30,000 జువెలర్లు బంగారు నాణేలు అమ్మకాలను నిలిపివేయాలని, అలాగే గోల్డ్ సేవింగ్స్ స్కీమ్స్ మరియు ఇతర ప్రమోషనల్ పథకాలను ప్రోత్సహించవద్దని నిర్ణయించారు. దిగుమతి సుంకం పెంపు మరియు బంగారం దిగుమతులపై ప్రభుత్వ విధానాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తమిళనాడు జువెలర్స్ ఫెడరేషన్ తెలిపింది.

కొయంబత్తూరు గోల్డ్‌స్మిత్స్ అసోసియేషన్ ప్రకారం, బంగారం ధర ఒక్క గ్రాముకు రూ.1,000 పెరిగింది. మంగళవారం రూ.14,400గా ఉన్న ధర బుధవారం రూ.15,400కి చేరింది. ఇందులో సుమారు రూ.3,000 వరకు పన్నులే ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు.

పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో అమ్మకాలపై ప్రభావం ఎలా ఉంటుందో చూడాల్సి ఉందని వ్యాపారులు అంటున్నారు. గత ఏడాదిలో అమ్మకాలు 60% తగ్గాయని వారు పేర్కొన్నారు.

ప్రభుత్వం గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్స్‌ను ప్రోత్సహించాలని, అలాగే డిజిటల్ గోల్డ్ మరియు ETFలపై నియంత్రణ అవసరమని జువెలర్లు సూచిస్తున్నారు.