
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఖాదర్ గూడెం గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా,మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.మానకొండూర్ సిఐ శ్రీలత తెలిపిన వివరాల మేరకు...బోధన్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుండి వరంగల్ కు వెళ్తుండగా వరంగల్ వైపు నుండి మంచిర్యాలకు వెళుతున్న కారు ఎదురుగా ఢీకొనడంతో కారులో ఉన్న మంచిర్యాలకు చెందిన వరప్రసాద్,సుమతి, కారు డ్రైవర్ మృతి చెందారు. మంచిర్యాలకు చెందిన ఐదుగురు వరంగల్ లో జరిగిన పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా మార్గంమధ్యలో ఖాదర్ గూడెం శివారులో ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొన్నారు.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉంది.మానకొండూర్ సిఐ శ్రీలత సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.













