న్యూఢిల్లీ: టీం ఇండియా మాజీ కెప్టెన్, కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇప్పుడు ఓ కొత్త అడుగు వేశాడు. ఓ ఫ్రాంచైజీకి ఆయన యజమాని అయ్యాడు. యూరోప్ టి-20 లీగ్2లో డబ్లిన్ గార్డియన్స్ జట్టును ద్రవిడ్ కొనుగోలు చేశాడు. ఈ ఏడాది ఆగస్టులో ఈ లీగ్ ప్రారంభంకానుంది. ఇందులో ఆరు ఫ్రాంచైజీలు తలబడతాయి. యూరోప్‌లో ఐసిసి ఆమోదం పొందిన తొలి బహుళ దేశాల క్రికెట్‌ టోర్నీ ఇదే. ఐర్లాండ్, స్కాట్‌లాండ్, రాయల్ డచ్ క్రికెట్ సంఘాలు ఈ లీగ్‌లో భాగమయ్యాయి. ‘‘యూరోప్‌లో దిగువ స్థాయి నుంచి క్రికెట్లో ప్రతిభావంతులను వెలికి తీయడానికి ఈ లీగ్‌ ఉపయోగపడుతుంది. ఇక్కడ ఆట ఎదుగుదలకు ఇదెంతో సహకరిస్తుంది. నన్ను ఆకట్టుకున్న అంశం అదే. అందుకే డబ్లిన్‌ గార్డియన్స్‌ జట్టును కొని ఈ లీగ్‌లో భాగమయ్యా. స్టార్‌ ప్లేయర్లతో స్థానిక కుర్రాళ్లు కలిసి ఆడబోతుండడంతో ఈ లీగ్‌ ఆసక్తికరంగా సాగబోతోంది’’ అని ద్రవిడ్‌ చెప్పాడు.

యూరోప్ టి-20 లీగ్‌లో ఫ్రాంఛైజీల కొనుగోళ్లలో పలువురు మాజీ క్రికెటర్లతో పాటు బాలీవుడ్‌ స్టార్లు కూడా భాగమయ్యారు. అభిషేక్‌ బచ్చన్‌ ఐరోపా లీగ్‌ వ్యవస్థాపకుల్లో ఒకడు. ఐరిష్‌ వోల్ఫ్స్‌ జట్టుకు మ్యాక్స్‌వెల్‌.. ఆమ్‌స్టర్‌డామ్‌ ఫ్లేమ్స్‌కు స్టీవ్‌ వా.. ఎడిన్‌బరో క్యాజిల్‌ రాకర్స్‌కు మెక్‌కలమ్, కైల్‌ మిల్స్‌.. గ్లాస్గో కాస్మిక్‌కు జాంటీ రోడ్స్, డుప్లెసిస్, క్లాసెన్‌ సహ యజమానులుగా ఉన్నారు. స్టీవ్‌ స్మిత్, మిచెల్‌ మార్ష్, టిమ్‌ డేవిడ్, మిచెల్‌ శాంట్నర్, లివింగ్‌స్టన్‌ లాంటి ప్రస్తుత క్రికెటర్లతో పాటు మాజీ ఆటగాళ్లు మెక్‌కలమ్, రోడ్స్, డుప్లెసిస్, క్లాసెన్‌ ఈ లీగ్‌లో ఆడబోతున్నారు.