
హైదరాబాద్: తనకు చట్టంపై గౌరవం, న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. జీవితాంతం భారత రాజ్యాంగానికి కట్టుబడే ఉన్నానని, దశాబ్దాలుగా ప్రజలతోనే ఉన్నానని, తాను మచ్చ లేని జీవితం గడిపానని గర్వంగా చెప్పగలనన్నారు. తన కుమారుడిపై నిరాధారమైన ఆరోపణలు వెలుగు చూసిన నేపథ్యంలో బండి సంజయ్ ప్రకటన విడుదల చేశారు. తనని రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు తన పిల్లలను, కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగుతున్నారని బండి దుయ్యబట్టారు. ఇది వారిలో గూడుకట్టుకున్న నిరాశ నిస్పృహలకు అద్దం పడుతుందని బండి విమర్శించారు. అట్టడుగు స్థాయి నుంచే తన ప్రజా జీవితాన్ని మొదలుపెట్టానని, కష్టపడి పనిచేసి ప్రజల ఆశీర్వాదంతో అప్పుడు కార్పొరేటర్ గా, నేడు ఎంపిగా ఎన్నిక కావడంతో పాటు ఇప్పుడు కేంద్రమంత్రి సేవలందిస్తున్నానని, తాను ఎదగడాన్ని కొన్ని శక్తులు జీర్ణించుకోలేక కుట్రలకు తెరలేపాయని మండిపడ్డారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో తనని వ్యక్తిగతంగా అప్రతిష్టపాలు చేయాలన్నదే ఆ కుట్రల వెనకున్న అసలు లక్ష్యమన్నారు. తప్పేదో.. ఒప్పేదో.. న్యాయవ్యవస్థ నిర్ణయిస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. సమయం ప్రతి ఆరోపణకు సమాధానం ఇస్తుందని, ప్రతి కుట్రను బహిర్గతం చేస్తుందని, సత్యమేవ జయతే అని ముగించారు.














