లక్నో: బర్త్ డే పార్టీలో ముగ్గురును హత్య చేసిన నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బులంద్‌శహర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... జీతూ సైనీ అనే యువకుడు ఏప్రిల్ 25న తన స్నేహితులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నాడు. ముగ్గురు స్నేహితులు అమరదీప్(30), మనీశ్(28), ఆకాశ్(18) జీతూ ముఖానికి కేక్ పూయడంతో గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో గన్ తీసుకొని ముగ్గురు స్నేహితులపై జీతు కాల్పులు జరిపాడు. ముగ్గురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. వెంటనే నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. జీతూపై రూ.50 వేల రివార్డును కూడా ప్రకటించారు. నిందితుడు కోసం ఖుర్జు గ్రామ శివారులో పోలీసులు గాలింపు చర్యలు చేపడుతుండగా అతడు ఎదురుపడ్డాడు. వెంటనే గన్‌తో పోలీసులపై కాల్పులు జరపడంతో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. పోలీసులు కాల్పులో జీతూ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జీతూ చనిపోయాడు.