
అమరావతి: పాలనకు టెక్నాలజీతో పాటు మానవతా దృక్పథం కూడా ముఖ్యమని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. మండల స్థాయి వరకు ఫైళ్ల క్లియరెన్స్ లో వేగం పెరగాలని అన్నారు. చంద్రబాబు అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల సమావేశం జరిగింది. ఇ-ఫైళ్ల క్లియరెన్స్ రోజుల వ్యవధి నుంచి గంటల వ్యవధిలోకి రావడంపై సిఎం సంతృప్తి చెందారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ లో ఫైళ్ల క్లియరెన్స్ ముఖ్యమైన అంశం అని ఫైళ్లను వెంటనే క్లియర్ చేస్తే ప్రభుత్వ సేవలు త్వరగా అందుతాయని తెలియజేశారు. 24 గంటల్లో ఇ- ఫైల్స్ డిస్పోజ్ చేసేలా మంత్రులు, అధికారులు, శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఫైళ్ల క్లియరెన్స్ లో అందరి పనితీరును ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నామని, ప్రజలకు సేవలందించే విషయంలో వినూత్న ఆలోచనలతో పాటు మరింత మెరుగైన పాలనకు కలెక్టర్లు ఆలోచించాలని సూచించారు.
ప్రభుత్వ నిబంధనలు, ప్రొసీజర్స్ సులభతరం కావాలని, ప్రజలకు త్వరితగతిన సేవలు అందించాలని అన్నారు. ఆన్ లైన్ సేవలను అందుబాటులోకి తెస్తే ప్రజల సమయం వృథా కాదని, టెక్నాలజీ ఇంటిగ్రేషన్ జరిగితే పాలన సులభతరం అవుతుందని చెప్పారు. డిసెంబర్ నాటికి వాట్సాప్ లో అన్ని ప్రభుత్వ సేవలు అందించేలా చర్యలు చేపట్టామని, ఆన్ లైన్ సేవలతో అవినీతితో పాటు దుర్వినియోగం కూడా తగ్గుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. అవేర్ 2.0 నుంచి వచ్చే సమాచారాన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ నిర్ణయాలు తీసుకోవాలని, పిడుగుల హెచ్చరికలను జారీ చేయటంలో ఇంకా పర్ఫెక్షన్ రావాలని అన్నారు. తుపాన్ హెచ్చరికల సమయంలో నేరుగా మొభైళ్లకే మెజేజ్ లు పంపించాలని, అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీల్లో అక్రమ కట్టడాలపై దృష్టి పెట్టాలని సూచించారు. మున్సిపాలిటీలు, సెమీ అర్బన్ ప్రాంతాల్లో..ఎలాంటి అక్రమ నిర్మాణాలు లేకుండా చూడాలని చంద్రబాబు ఆదేశించారు.















