రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ చిత్రం ‘పెద్ది’ ప్రీమియర్ షోలు ఓవర్సీస్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన టాక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రేక్షకులు, సినీ విశ్లేషకుల అభిప్రాయాల ప్రకారం ఫస్ట్ హాఫ్‌కు మిశ్రమ స్పందన లభించింది. అయితే ప్రీ-ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఎమోషనల్ సీక్వెన్స్‌లు, రామ్ చరణ్ నటన, ఏఆర్ రెహ్మాన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయని టాక్ వినిపిస్తోంది.

‘రయ్ రయ్ రా రా’ పాట విజువల్‌గా అద్భుతంగా ఉందని, రామ్ చరణ్ డ్యాన్స్ అభిమానులను ఆకట్టుకుంటుందని ప్రేక్షకులు పేర్కొంటున్నారు. జాన్వీ కపూర్ పాత్ర కూడా పర్వాలేదనిపించే స్థాయిలో ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

భావోద్వేగభరితమైన ప్రీ-ఇంటర్వెల్ సన్నివేశం, ఆసక్తిని పెంచే ఇంటర్వెల్ బ్లాక్ సెకండాఫ్‌పై అంచనాలను మరింత పెంచాయి. ఇప్పటికే సినిమా టీమ్ చివరి 50 నిమిషాలు ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేస్తాయని చెప్పడంతో, ఇప్పుడు అందరి దృష్టి సెకండాఫ్‌పైనే నిలిచింది.