🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTటుడేతెలుగు
Advertisement
Sponsored by simplysouth
📖
పంచతంత్రం

నల్లి-చీరపోతు కథ

nalli-cheerapootu katha

⏱️ 21 నిమిషాల పఠనం

"మందవిసర్పణి" అనే పేరుగల చీరపోతు ఒకటి రాజుగారి పాన్పును ఆశ్రయించి కాలం గడుపుతూ ఉండేది. రాజుగారు గాఢంగా నిద్రపోయిన తరువాత అది నెమ్మదిగా బయటకు వచ్చి ఆయన రక్తం త్రాగి కడుపు నింపుకొనేది. పగటి పూట పరుపు కిందనో, తలగడ కిందనో దాగి ఎవరికంటా పడకుండా కాలం గడుపుతుండేది. ఏ ఆటంకము, ప్రాణ భయము లేకుండా ఆ చీరపోతు కాలం గడుపుతుండగా ఒకనాడు "డిండిమం" అనే నల్లి ఆ మంచం మీదకి చేరింది. దానిని చూచి మందవిసర్పణి "ఓయి! ఎచట నుండి వచ్చావు? నీ రాకకు కారణం ఏమిటి?" అని అడిగింది.

అపుడా నల్లి "నా పేరు డిండిమము. ఇంతకాలం పేదల ఇళ్ళలో ఉన్నాను, ఎందరి రక్తమో రుచి చూసాను, కాని రాజుల రక్తం చవిచూడలేదు. సన్న బియ్యపు అన్నము, కమ్మని పప్పు, మాంసపు కూరలు, రుచిగల పిండివంటలు, వెన్న, నేయి, పాలు, పెరుగు, పండ్లు మొదలైన మంచి వంటకాలు భుజించే రాజుల రక్తం ఎంతో రుచిగా ఉంటుందని విన్నాను. దయచేసి నన్ను నీ స్నేహితునిగా భావించు. నేను కూడా నీతోపాటు ఈ మంచం మీదే కాలం గడుపుతాను" అని చీరపోతును బతిమాలింది. అమాయకురాలైన చీరపోతు సరే నీ ఇష్టం, నా సొమ్మేమీ పోదు కదా! కానీ ఒక్క విషయం, ఇక్కడ నీవెంతో జాగ్రత్తగా ఉండాలి. రాజు గాఢనిద్రలో ఉన్న సమయం కనిపెట్టి, నెమ్మదిగా పోయి ఆయనకు బాధ కలగకుండా మెలుకువ రాకుండా మెల్లగా రక్తం తాగాలి" అని చెప్పింది. అందుకు నల్లి సరే అన్నది.

ఆ రాత్రి రాజుగారు పడుకొని నిద్రపోకముందే నల్లి పరుపుపైకి పాకి వీపును కుట్టి రాజుగారి రక్తం పీల్చసాగింది. రాజుగారు అబ్బా! అని పెద్దగా అరిచి సేవకులను పిలిచి నా వీపుపై ఏదో కుట్టింది. తేలు కుట్టినట్లు మండుతుంది. దీపం తెచ్చి చూడండి అని ఆజ్ఞాపించాడు. వారు దీపం తెచ్చేంతలో నల్లి పారిపోయి మంచం సందులో దూరింది. భటులకు తలగడ కిందున్న చీరపోతు కనిపించింది. అదే రాజును కుట్టివుంటుందని భావించి వారు చీరపోతును నలిపి చంపేశారు. కనుక స్వభావం తెలుసుకోకుండా ఎవరిని పడితే వారిని దరి చేర్చుకోరాదు, బుద్ధి తెలుసుకొని మెలగాలి. అల్పబుద్ది గల వానికి ఆకతాయికి ఉపకారం చేయటం మంచిది కాదు. అలా చేస్తే ప్రాణాలకే ముప్పు కలుగుతుంది. మనవల్ల ఉపకారం పొందినవారే మనకు అపకారం తల పెడతారు.

దమనకుడి కథ విని సింహం నా బలం ముందు సంజీవకుని బలం ఎంత? అతను నాకెలా హాని చేయగలడని అడిగింది. తమతో పోరాడగల శక్తి సంజీవకునికి లేదు. నిజమే, కాని కాటక పాటకుల వారి ముఠావాళ్ళు ఎందరో అతనికి సహాయంగా ఉన్నారు. అతడు వారితో కలిసి మిమ్ములను చంపే ఉపాయం ఆలోచిస్తున్నాడని అనుమానం" అని దమనకుడు పలకగా, పింగళకుడు భయపడి దమనకా నీవు తక్షణం సంజీవకుని వద్దకు వెళ్ళి అభిప్రాయం తెలుసుకొనిరా, వెంటనే వెళ్ళు" అని చెప్పాడు.

చిత్తం మహారాజా! వెళ్ళొస్తా అని దమనకుడు సంతోషంగా బయలుదేరి సంజీవకుని సమీపించి కంటనీరు పెట్టసాగాడు. దమనకా! ఎందుకు విచారించుచున్నావు? మనవారంతా క్షేమంగా ఉన్నారా? అని అడిగాడు సంజీవకుడు. దమనకుడు తమ దయవలన అందరంక్షేమంగానే ఉన్నాము. కాని తమకే ఆపద ముంచుకొచ్చింది, అది తలుచుకొని విచారించుచున్నాను. తమరు కొలువుకు రాగానే పింగళకుడు మిమ్ములను చంపి మీ రక్తం తాగాలని చూస్తున్నాడు. నన్ను తమరిని వెంటనే వెంటబెట్టుకొని రమ్మని నన్ను మీ వద్దకు పంపాడు అని చెప్పింది.

ఆ మాటలు విని సంజీవకం ఉలిక్కిపడి దమనకా! నన్ను తమ ప్రాణములతో సమానంగా చుచుకుంటున్న రాజుగారు నన్ను చంపదలచాడా? నేను నమ్మలేకపోతున్నాను" అన్నాడు. అందుకు దమనకుడు నవ్వి "రాజుల మాటలు నీటి మూటలు, వారి ప్రేమాభిమానాలు నమ్మిన వారు వెర్రివాడితో సమానం. రాజులు తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్ళంటారు. వారికి ఆగ్రహం వచ్చిననూ అనుగ్రహం వచ్చిననూ మనలాంటి వారెదురు చెప్పలేరు కదా! మనసు పుడితే ప్రాణమెలా ఇస్తారో, మనసు చెడితే అలాగే ప్రాణం తీస్తారు. రాజుసేవకంటే మరొక నరకమున్నదా! ఈ లోకంలో రాజుసేవలో సుఖపడిన వారు ఎవడైనా ఉన్నాడా! తాత్కాలికంగా సుఖపడి చివరకు చెడిపోవటం మటుకు ఖాయం" అన్నది.

సంజీవకుడు ధైర్యం వహించి "జాతస్యహిదృవం మృత్యుహు" పుట్టినవాడు గిట్టక తప్పదు. ఇంతకూ నేను చేసిన నేరమేమిటి? నేను కలలోనైనా ఆయనకు అపకారం తలపెట్టను కదా! తప్పు చేయని నన్ను రాజు నన్నెందుకు చంపాలనుకుంటున్నాడు?" అని అడిగింది. మీరు రాజద్రోహులైన కాటక పాటకులతో స్నేహం చేస్తున్నారని, తమ రాజ్యం అపహరించడానికి వారితో కలిసి కుట్ర చేస్తున్నారని ఎవరో చెప్పగా పింగళకుడు విన్నాడట. అందువలన విచారం లేక మిమ్ములను చంపడానికి నిశ్చయించుకున్నాడు అని దమనకుడు చెప్పాడు.

మనరాజు మంచివాడు, ఎవరో చెప్పిన మాటలు నమ్మి మంచి చెడు విచారించక దండించడం తప్పు. చెప్పుడు మాటలు వినే రాజుని సేవించటం కంటే గొప్ప తప్పు మరొకటి లేదు. చెప్పుడు మాటలు వినేవాడి కంటే చెడ్డవారు మరొకరు లేరు. చెడ్డవారితో స్నేహం చేసేవాడు సముద్రంలో కలిసేనది నీరు వలె చెడిపోతాడు.

అడవిలో దొరికిన గడ్డిపోచలు మేసి విశ్వాసంతో రాజును సేవిస్తున్న నా మీద మాయోపాయములు పన్ని ఎవరో నా మీద చాడీలు చెప్పి ఉంటారు. అది నమ్మిన రాజు తనను సేవిస్తున్న నన్ను చంపుట చాలా తప్పు. పూర్వం సింహాన్ని సేవిస్తున్న ఒంటెను"పులి, నక్క, కాకి" మాటలు నమ్మి చంపిన సింహంలా నన్ను చంపి భక్షిద్దామనుకుంటున్నాడు కాబోలు" అని చెప్పగా దమనకుడు "ఆ ఒంటె-సింహం" కథ ఏమిటో చెప్పు అని అడిగింది. అపుడు సంజీవకుడు ఆ కథను చెప్పడం ప్రారంభించాడు.

📖 మరిన్ని పంచతంత్రం

Advertisement
Sponsored by ATA – American Telugu Association