అమెరికాలోని న్యూయార్క్ నగరంలో పెరుగుతున్న జీవన వ్యయాలు, ఇళ్ల అద్దెలు, ఇతర ఖర్చులతో విసిగిపోయిన ఓ దంపతులు జీవితంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటలీలోని ప్రశాంతమైన గ్రామీణ ప్రాంతానికి వెళ్లి సుమారు రూ.12.4 లక్షల వ్యయంతో ఓ ఇంటిని కొనుగోలు చేసి అక్కడే స్థిరపడిపోయారు.
దంపతుల ప్రకారం, న్యూయార్క్లో ప్రతి నెల భారీ మొత్తాన్ని అద్దె, ఇతర ఖర్చులకే వెచ్చించాల్సి వచ్చేది. దీంతో ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుండటంతో తక్కువ ఖర్చుతో మెరుగైన జీవన విధానం కోసం విదేశాల్లో అవకాశాలను పరిశీలించారు.
ఇటలీలోని అబ్రూజ్జో ప్రాంతంలో తక్కువ ధరలకు ఇళ్లు లభిస్తుండటంతో అక్కడే ఇల్లు కొనుగోలు చేశారు. అనంతరం ఇంటిని అవసరాలకు అనుగుణంగా మరమ్మతులు చేసి నివాసానికి అనుకూలంగా మార్చుకున్నారు.
ఇప్పుడు అక్కడ జీవన వ్యయం గణనీయంగా తగ్గిపోయిందని, రుణ భారం లేకుండా ప్రశాంతంగా జీవిస్తున్నామని దంపతులు వెల్లడించారు. అంతేకాకుండా రిమోట్ వర్క్తో పాటు మరో ఆస్తిని పర్యాటకులకు అద్దెకు ఇచ్చి అదనపు ఆదాయాన్ని కూడా పొందుతున్నట్లు తెలిపారు.
"మళ్లీ న్యూయార్క్కు వెళ్లి అక్కడే నివసించాలని మేము ఊహించలేం. ఇటలీలో లభిస్తున్న జీవన నాణ్యత, ప్రశాంత వాతావరణం, ఆర్థిక స్వేచ్ఛ మాకు ఎంతో సంతృప్తిని ఇస్తున్నాయి" అని దంపతులు పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అధిక జీవన వ్యయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అనేక మంది తక్కువ ఖర్చుతో మెరుగైన జీవన విధానం అందించే దేశాల వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఈ దంపతుల కథనం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.












