హైదరాబాద్‌కు చెందిన గోల్ఫర్ మహ్మద్ అజర్ కోలార్ ఓపెన్ గోల్ఫ్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచారు. ఈ విజయంతో ఆయన కెరీర్‌లో తొలి ప్రొఫెషనల్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.

జియాన్ హిల్స్ గోల్ఫ్ కౌంటీలో జరిగిన రూ.1 కోటి ప్రైజ్ మనీ టోర్నమెంట్‌లో అజర్ చివరి రౌండ్‌లో వన్ అండర్ 71 స్కోర్ చేశారు. నాలుగు రౌండ్లలో 70-68-70-71తో మొత్తం 9 అండర్ 279 స్కోరు సాధించి రెండు షాట్ల తేడాతో టైటిల్ గెలిచారు. విజేతగా రూ.15 లక్షల ప్రైజ్ మనీ అందుకున్నారు.

2020లో ప్రొఫెషనల్ టూర్‌లోకి అడుగుపెట్టిన 27 ఏళ్ల అజర్.. ఫైనల్ రౌండ్‌ను ఢిల్లీకి చెందిన షౌర్య భట్టాచార్య కంటే రెండు షాట్లు వెనుకబడి ప్రారంభించారు. గాలి, వర్షంతో పరిస్థితులు కఠినంగా ఉన్నప్పటికీ అజర్ సహనం కోల్పోకుండా స్థిరమైన ఆటతీరుతో ముందుకు సాగారు.

రెండో, నాలుగో హోల్స్‌లో బర్డీలు సాధించిన అజర్.. 12వ హోల్‌లో సుమారు 30-35 అడుగుల దూరం నుంచి బర్డీ పుట్ చేసి ఆకట్టుకున్నారు.

చండీగఢ్‌కు చెందిన అంగద్ చీమా, ఢిల్లీకి చెందిన షౌర్య భట్టాచార్య 7 అండర్ 281 స్కోరుతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. ఫైనల్ రౌండ్‌కు ముందు ఆధిక్యంలో ఉన్న భట్టాచార్య 17, 18వ హోల్స్‌లో వరుసగా డబుల్ బోగీలు చేయడంతో టైటిల్ రేసులో వెనుకబడ్డారు.

ఈ విజయంతో 2026 DP వరల్డ్ PGTI ఆర్డర్ ఆఫ్ మెరిట్‌లో అజర్ 17వ స్థానం నుంచి 10వ స్థానానికి ఎగబాకారు. ఈ సీజన్‌లో ఆయన ఆదాయం రూ.35,14,675కు చేరింది. ఏప్రిల్‌లో జరిగిన బౌల్డర్స్ క్లాసిక్‌లో సంయుక్త రెండో స్థానం సాధించడం ఇప్పటివరకు ఆయన అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది.