లోతైన సముద్ర పరిశోధనలో భారత్ మరో కీలక ముందడుగు వేసింది. కోల్‌కతాలో కొత్త స్వదేశీ ఓషన్ రీసెర్చ్ వెసెల్ ‘సాగర్ మంథన్’ను ప్రారంభించారు.

నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ కోసం గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ ఈ నౌకను నిర్మించింది. సుమారు రూ.840 కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ నౌక కేంద్ర ప్రభుత్వ డీప్ ఓషన్ మిషన్‌లో భాగంగా పనిచేయనుంది.

లోతైన సముద్రాల్లో పరిశోధనలు

సాగర్ మంథన్ ద్వారా సముద్రపు లోతుల్లో సర్వేలు, సముద్ర మ్యాపింగ్, నమూనాల సేకరణ, సముద్రగర్భంపై పరిశోధనలు చేపట్టనున్నారు.

సముద్రంలోని ఖనిజాలు, భూగర్భ నిర్మాణం, వాతావరణ మార్పులు, సముద్ర పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు కూడా ఈ నౌక ఉపయోగపడనుంది.

అత్యంత క్లిష్టమైన సముద్ర ప్రాంతాల్లోనూ పరిశోధనలు చేపట్టే సామర్థ్యం దీనికి ఉంది. రిమోట్ ఆపరేటెడ్, అటానమస్ అండర్‌వాటర్ వెహికల్స్‌ను కూడా ఈ నౌక ద్వారా సముద్రంలోకి పంపవచ్చు.

భారత్ సముద్ర లక్ష్యాలకు బూస్ట్

సాగర్ మంథన్ ప్రారంభం సముద్ర పరిశోధనకే కాకుండా భారత నౌకా నిర్మాణ రంగానికి కూడా కీలక పరిణామం.

అధునాతన పరిశోధనా నౌకను దేశీయంగా నిర్మించడం ద్వారా విదేశీ నౌకలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. భారత శాస్త్రవేత్తలు దీర్ఘకాలిక సముద్ర పరిశోధనలు చేపట్టేందుకు ఇది మరింత బలాన్ని ఇస్తుంది.

నాలుగు దశాబ్దాలకు పైగా సముద్ర పరిశోధనలకు సేవలందించిన ‘సాగర్ కన్య’ స్థానాన్ని భవిష్యత్తులో సాగర్ మంథన్ భర్తీ చేయనుంది.

నౌకకు మరిన్ని పరీక్షలు, సముద్ర ప్రయోగాలు పూర్తయ్యాక 2028లో అధికారికంగా సేవల్లోకి తీసుకురావాలని భావిస్తున్నారు.

కోల్‌కతా షిప్‌యార్డ్స్ నుంచి సముద్రపు లోతుల వరకు.. ‘సాగర్ మంథన్’ భారత సముద్ర పరిశోధనకు కొత్త దిశ చూపించనుంది.