
ఢిల్లీ: యువతపై ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ దారుణంగా వ్యవహరించిందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.ఈ దేశ యువత పట్ల దారుణంగా వ్యవహరించడం సరికాదు అని అన్నారు. సోమవారం పార్లమెంట్ వద్ద విద్యార్థులపై లాఠీచార్జి చేయడంపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతలతో స్పీకర్ ఓం బిర్లాను కలిశానని, ఆందోళనపై చర్చించాలని స్పీకర్ ను కోరితే.. ప్రభుత్వాన్ని అడగాలని అంటున్నారని విమర్శించారు. చెదపురుగుల వల్ల విద్య, పరీక్షా విధానం కుళ్లిపోయిందని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, పరీక్షా విధానాలపై యువత నిరసన తెలుపుతోందని, దేశ యువత భవిష్యత్తుకు సంబంధించిన అంశంపై.. పార్లమెంట్ లో చర్చ జరగాల్సిందేనని, విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జికి మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కచ్చితంగా రాజీనామా చేయాలని కోరారు. ఈ విషయంలో ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.











