వీధి బయట ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. స్థానికులు కొంతమంది చూసి గట్టిగా అరవడంతో కుక్కలు పారిపోయాయి. సిద్దిపేట జిల్లా బోటిమీదిపల్లికి చెందిన సుమన్ శ్రీవాణి దంపతులు కూమారుడు హాద్విక్ (7)తో కలిసి బీఎన్‌రెడ్డినగర్ డివిజన్ టీచర్స్ కాలనీలోని తమ బంధువుల ఇంటికి వచ్చారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం రాత్రి 8.45 నిమిషాలకు బాలుడు వీధిలో ఆడుకుంటుండగా నాలుగైదు వీధికుక్కలు గుంపుగా వచ్చి ఒక్కసారిగా బాలుడిపై దాడిచేశాయి. దీంతో బాబు మొహానికి ,కాళ్లుచేతులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉన్నదని, 48 గంటల అనంతరం పూర్తి ఆరోగ్య పరిస్థితిపై సృష్టత వచ్చే అవకాశం ఉన్నదని కామినేని ఆసుపత్రి వైద్యులు ఓ ప్రకటనలో తెలిపారు.