ఢిల్లీ: మాజీ సిఎం కెసిఆర్ కుటుంబం వల్ల సింగరేణి సంస్థకు ఎంతో నష్టం జరిగిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సింగరేణికి ఎవరి హయాంలో చెడు జరిగిందో చర్చకు బిఆర్ఎస్ సిద్ధమా? అని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణికి రూ. 54 వేల కోట్లు బకాయిలు పెట్టి పోయిందని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.54 వేల కోట్లు వసూలు చేస్తామని తెలియజేశారు. కొందరు ప్రధాని నరేంద్ర మోడీని విమర్శిస్తూ..సోషల్ మీడియాలో వీడియోలు పెట్టారని, అభ్యంతరకర వీడియోలపై ఇప్పటికే కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారని కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసేలా..రెచ్చగొట్టే వీడియోలు పెట్టారని, మెటా ఇండియా ప్రతినిధిపై కూడా పోలీసులు కేసు పెట్టారని మండిపడ్డారు. హైదరాబాద్ లో బిజెపి కార్యకర్త సాయికిరణ్ గౌడ్ ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసిన పోలీసులను ప్రభుత్వం బెదిరిస్తోందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.