
కృత్రిమ మేధ, ఆధునిక సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా కార్మిక శక్తిని భర్తీ చేయలేవు
సనత్నగర్ ఇఎస్ఐలో ఒపిడి విభాగం ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి
మన్సుఖ్ మాండవీయ
మన తెలంగాణ/హైదరాబాద్: ఆధునిక సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత వృద్ధి చెందినప్పటికీ దేశ పురోగతిలో కార్మికుల పాత్రే కీలకమని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ స్పష్టం చేశారు. మంగళవారం సనత్నగర్లోని ఈఎస్ఐసీ ఆసుపత్రిలో రూ. 211.13 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక ఒపిడి విభాగాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాండవీయ మాట్లాడుతూ, ఒపిడి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 12లక్షల,30వేల,183 మంది బీమా చందాదారులు, ఇతర లబ్ధిదారులకు ఆధునిక అవుట్ పేషెంట్ సేవలు అందుతాయన్నారు. ఇది కళాశాల ఆసుపత్రి కూడా కావడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా చందాదారులకూ ఆరోగ్య సంరక్షణ సేవలు లభిస్తాయన్నారు.
ఈ ప్రాంగణంలోని 43,611.04 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కట్టిన కొత్త సౌధంలో జనరల్ మెడిసిన్, ఈఎన్టి, డెంటిస్ట్రీ, ప్రసూతి గైనకాలజీ, ఆప్తాల్మాలజి, ఆర్థోపెడికస్, సైకియాట్రి, డెర్మలాటజి, పల్మనాలజి, పిడియాట్రిక్స్, జనరల్ సర్జరి, ఆయుష్ విభాగాల ఒపిడిలు పనిచేస్తాయన్నారు. వీటితో పాటు ఫిజికల్ మెడిసిన్, రిహాబిలిటేషన్, రేడియాలజి, యోగా విభాగాలు సహా 3 వార్డులలో 60 వంతున 180 సాధారణ పడకలు సహా 25 ఐసియు, 20 ఎన్ఐసియు పడకలు, ఐసియు/ఎన్ఐసియు యూనిట్లు, మందుల దుకాణం, ఒక క్లినికల్ లెక్చర్ థియేటర్ కూడా ఉన్నాయని కేంద్రమంత్రి తెలిపారు.
దీని ద్వారా కార్మికుల ఆరోగ్య సంరక్షణ సేవలు బలోపేతం అవుతాయన్నారు. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశాభివృద్ధిలో శ్రమశక్తి, యువశక్తి రెండు ప్రధాన స్తంభాలన్నారు. కార్మికులకు గౌరవం, సామాజిక భద్రత కల్పించడం మోదీ ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అన్నారు. సేవ, సమ్మాన్ (గౌరవం) అనేవి తమ పాలనలో ప్రధానమని ఆయన పేర్కొన్నారు.
దశాబ్ద కాలంలో రెట్టింపు: 15 కోట్లకు చేరిన ఈఎస్ఐ లబ్ధిదారులు
గడిచిన పదేళ్లలో ప్రభుత్వం సామాజిక భద్రతను బలోపేతం చేసిందని కేంద్రమంత్రి వివరించారు. ఈఎస్ఐ లబ్ధిదారుల సంఖ్య 2014లో 7.5 కోట్లు ఉండగా, ప్రస్తుతం అది 15 కోట్లకు చేరిందని ఆయన వెల్లడించారు. దేశంలో సామాజిక భద్రత పరిధి 2014లో 19 శాతంగా ఉండగా, ప్రస్తుతం అది 64 శాతానికి పెరిగి.. 94 కోట్ల మంది దీని పరిధిలోకి వచ్చారని చెప్పారు. ఇది అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదికలు తెలియజేశాయని చెప్పారు. ప్రధాని మోడీ నాయకత్వంలో 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు, నాలుగు కోట్లకు పైగా పక్కా ఇళ్ల నిర్మాణం వంటి సంక్షేమ పథకాలతో కార్మిక వర్గం జీవన ప్రమాణాలను మెరుగయ్యాయని ఆయన తెలిపారు.
కార్మిక చట్టాల్లో విప్లవాత్మక మార్పులు
కార్మిక సంక్షేమం కోసం ప్రభుత్వం పాత చట్టాలను సరళతరం చేసిందని కేంద్రమంత్రి చెప్పారు. 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చామని కేంద్రమంత్రి వివరించారు. ఇందులో భాగంగా ఉద్యోగులకు తప్పనిసరిగా అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడం, 40 ఏళ్లు పైబడిన వారికి ఏటా ఉచిత ఆరోగ్య పరీక్షలు, సమాన పనికి సమాన వేతనం, ఏడాది సర్వీసు పూర్తయిన వారికే గ్రాట్యుటీ అర్హత వంటి కీలక నిబంధనలను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. యాజమాన్యాలు, కార్మికులు పరస్పర సహకారంతో అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
నిర్మాణ కార్మికులకు సత్కారం
సనత్నగర్ ఈఎస్ఐసీ ఆసుపత్రి ఓపీడీ బ్లాక్ నిర్మాణంలో కష్టపడిన కార్మికులను ఈ కార్యక్రమంలో మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రత్యేకంగా సత్కరించారు. అనంతరం, లబ్ధిదారులకు నగదు ప్రయోజనాలను అందజేశారు. ఈ కొత్త ఓపిడి విభాగం హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లోని బీమా చందాదారులకు అత్యాధునిక వైద్య సేవలను అందించనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజే తదితరులు పాల్గొన్నారు.









