
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి,
శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి దర్శించుకున్న,
జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్,
మన తెలంగాణ/ఊర్కోండ: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయడంతో పాటు గ్రామాల్లో పరిశుభ్రత, తాగునీటి సదుపాయం, పచ్చదనం పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం ఉదయం 6 గంటలకే ఊర్కొండ మండల పరిధిలోని ఉరుకొండపేట, ముచ్చర్లపల్లి గ్రామాలను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. నిర్మాణాల పురోగతి, నాణ్యత, ప్రభుత్వ నిబంధనల అమలు తదితర అంశాలను వివరంగా అడిగి తెలుసుకున్నారు.
ఇళ్ల లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడిన కలెక్టర్, ప్రభుత్వం అందించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలని సూచించారు. పనులను ఆలస్యం చేయకుండా వేగంగా పూర్తి చేయాలని, నిర్మాణంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే స్థానిక అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన బిల్లులను దశల వారీగా ఆధార్ లింక్ చేసిన బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఇప్పటికే ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన లబ్ధిదారులు త్వరగా గృహప్రవేశాలు చేసుకోవాలని కూడా కలెక్టర్ సూచించారు.
అదేవిధంగా గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించిన కలెక్టర్, చెత్త నిర్వహణ, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి వసతులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, అందుకు ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.ప్రతి గ్రామం పరిశుభ్రంగా, పచ్చదనంతో కళకళలాడేలా చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో చెత్త పేరుకుపోకుండా క్రమం తప్పకుండా శుభ్రపరిచే కార్యక్రమాలు చేపట్టాలని, ప్రజల్లో కూడా పరిశుభ్రతపై అవగాహన పెంచాలని సూచించారు.

ముచ్చర్లపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించిన కలెక్టర్కు అక్కడి గ్రామస్తులు పలు సమస్యలను వివరించారు. పాఠశాలలో మౌలిక సదుపాయాల లోపం, మరమ్మత్తుల అవసరం వంటి అంశాలను ఆయన దృష్టికి తీసుకురాగా, వాటిపై వెంటనే స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశిస్తూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. అంతకుముందు గ్రామ సందర్శనలో భాగంగా ఊరుకొండపేటలోని ఆంజనేయ స్వామి ఆలయాన్ని కలెక్టర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. జిల్లా కలెక్టర్ కల్వకుర్తి ఆర్డీవో జనార్దన్ రెడ్డి, వెంట పిడి హౌసింగ్ సంగప్ప, తాహసిల్దార్ యూసుఫ్ అలీ, ఎంపీడీవో సత్యపాల్ రెడ్డి, మండల స్థాయి వివిధ శాఖల అధికారులు, ఆయా గ్రామాల సర్పంచ్లు అబ్దుల్ రషీద్, మ్యాకల మంజుల శ్రీనివాసులు, వినీత ధర్మేందర్ రెడ్డి,ఉప సర్పంచ్ రేపాని శ్రీనివాసులు,ప్రజాప్రతినిధులు ఉన్నారు.










