
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ పరిధిలో ఒక ఇంటిపై పిడుగు పడింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. పిడుగు పడిన తీవ్రతకు ఆ ఇంట్లోని విద్యుత్ వైరింగ్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. టివి, ఫ్రిజ్, ఇన్వర్టర్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయాయి. భవనం గోడలకు స్వల్పంగా పగుళ్లు ఎర్పడ్డాయి. ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్న వారు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పిడుగు పడటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.











