
మనతెలంగాణ/సిటీబ్యూరోః హైదరాబాద్ మహానగరంలో ‘హైడ్రా’ మరో భారీ ఆపరేషన్ నిర్వహించింది. హైదరాబాద్,రంగారెడ్డి,మేడ్చల్ జిల్లాల్లోని పలు ప్రాంతాలలో శనివారం భారీ పోలీసు బలగాలతో రంగంలోకి దిగిన ‘హైడ్రా’ 840 ఎకరాల ప్రభుత్వం భూములను కాపాడి ఫెన్సింగ్ వేసింది. ఈ భూముల విలువ రూ.30 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. నగర శివార్లలోని శేరిలింగంపల్లి మండల పరిధి రాయదుర్గం సర్వేనెంబర్ 46లోని 84 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న హైడ్రా...భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసింది.
రాయదుర్గం ఐటీ కారిడార్లో టి హబ్కు కూతవేటు దూరంలో ఉన్న అత్యంత ఖరీదైన ప్రాంతంలో కన్నేసి సమీపంలో అరెకరం ప్రైవేటు భూమిని కొనుగోలు చేసి...పక్కనే ఉన్న ప్రభుత్వభూమిని కాజేయాలని చూడటంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగి ఈ భూమిని స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలోని కంటోన్మెంట్ ప్రాంతంలో జిఎల్ఆర్(జనరల్ ల్యాండ్ రిజిస్టర్) నెంబర్ 243,255లలో ఉన్న 106 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది. మైనింగ్ కార్యకలాపాలతో పాటు వణ్య ప్రాణులకు ఇబ్బంది కలిగిస్తూ కబ్జాదారులు ఆక్రమణలు చేస్తున్నారన్న స్థానికుల ఫిర్యాదులతో రంగంలోకి దిగిన హైడ్రా కబ్జాలను తొలగించి ప్రభుత్వ భూమిని కబ్జాల నుంచి విముక్తి కల్పించింది.
శంషాబాద్ మండల పరిధి బహదూర్గూడలో 1954 ఖాస్రా పహాణి ప్రకారం సర్వే నెంబర్ 25,26లలోని 650 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది. చుట్టూ ఫెన్సింగ్ వేసింది.ఈ ప్రభుత్వ భూములను కాజేసే క్రమంలో పలువురు ఫామ్హౌజ్ల నిర్మాణం, ప్రైవేటు వ్యక్తులు వ్యవసాయం,బడాబాబుల ఆక్రమణలు చేయడంతో శంషాబాద్ మండల రెవెన్యూ అధికారుల సమక్షంలో భారీ పోలీసు బలగాలను మోహరించి ప్రభుత్వ భూమిని కాపాడింది. ఈక్రమంలో స్థానికులు అడ్డుపడటంతో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు చెదరగొట్టి ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా,రెవెన్యూ,మున్సిపల్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈ భారీ ఆపరేషన్ను నిర్వహించి 840 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నామని, ఈ భూముల విలువ రూ.30వేల కోట్లకు పైగా ఉంటుందని హైడ్రా ఒక ప్రకటనలో తెలిపింది.











