హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో శ్రీ భవానీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న భావోద్వేగ ప్రధాన చిత్రం ‘తీరం’ టైటిల్ సాంగ్‌ను ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ‘పుష్ప’ ఫేమ్ నటుడు జగదీష్, ఫన్ బకెట్ మహేష్ విట్ట, నటుడు రాజ్‌కుమార్ కసిరెడ్డి, దర్శకుడు ప్రసాద్, జబర్దస్త్ సద్దాం, నటుడు కుమానన్ తదితరులు హాజరై టైటిల్ సాంగ్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు వంశీ మునగాల మాట్లాడుతూ తీరం చిత్రం ప్రతి ఒక్కరి హృదయాలను తాకేలా భావోద్వేగభరితమైన కథతో రూపొందుతోందన్నారు. నిర్మాత ఉపేందర్ గంగావెల్లి మాట్లాడుతూ సినిమా నిర్మాణం తుది దశకు చేరుకుందని, విడుదల తేదీతో పాటు ఇతర విశేషాలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో హీరో ప్రభు, హీరోయిన్ హరిప్రియా, రమణ, విజయ్ శెట్టి పాల్గొన్నారు.