అమరావతి: శ్రీకాకుళంలో మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డి ఎవరిని పరామర్శిస్తున్నారో, ఎవరిని కాపాడుతున్నారో అందరికీ తెలుసు అని మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి బంధువులను పరామర్శించాలని అన్నారు. శ్రీకాకుళం జిల్లా కొత్తరోడ్డు జంక్షన్ కు జగన్ చేరుకున్నారు. కాన్వాయ్ కొత్త రోడ్డు జంక్షన్ దగ్గర భారీ బందోబస్తు, అంపోలు జంక్షన్ వద్ద మూడెంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీకాకుళంలో మహిళా ఎస్ఐపై దౌర్జన్యం చేశారని, జగన్ వెళ్లే దారిలోనే ప్రధాని మోడీ పర్యటన ఉందని తెలియజేశారు. ప్రధానికి భద్రత కల్పించే దారిలో ఆందోళనలు చేయకూడదని, జగన్ పర్యటనలో ధర్నాలు, ర్యాలీలు, సభకు అనుమతి లేదని పార్థసారధి సూచించారు. పోలీసులపై దాడి చేసే స్థాయికి వైసిపి నేతలు వెళ్లారని, వైసిపి వెంట వెళ్లే యువకుల తల్లిదండ్రులు భయపడుతున్నారని విమర్శించారు. కానిస్టేబుళ్లను దూరం జరిపి మరీ మహిళా ఎస్ఐపై దాడికి దిగారని, భయపెట్టి అధికారంలోకి వచ్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలకు తావులేదని పార్థసారధి హెచ్చరించారు.