జనగామ: భార్య మరణం తట్టుకోలేక  పూజారి, కుమారుడు కోనేరులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జనగామ జిల్లా లింగాలఘణపురం మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బండలగూడెం గ్రామంలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వరయూరు లక్ష్మీనరసింహ చార్యులు(54) అనే అర్చకుడు గత 20 ఏళ్లుగా పూజారిగా సేవలందిస్తున్నాడు.  అదే గ్రామంలో తన భార్య శ్రీదేవి, మానసిక వికలాంగుడైన కుమారుడు పవనకుమారాచార్యులు(25)తో కలిసి ఉంటున్నాడు.  గత నెల 16న భార్య శ్రీదేవి మరణించడంతో రోజు భర్త  తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఎప్పుడైనా తన కుమారుడితో కలిసి ఆలయ కోనేరులో దూకి చనిపోతానని గ్రామస్థులతో చెప్పేవాడు. భార్య మరణం తట్టుకోలేక రెండు రోజుల క్రితం లక్ష్మీనరసింహ చార్యులు తన కుమారుడితో కలిసి ఆలయ కోనేరులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం కోనేరులో మృతదేహాలు కనిపించడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.