
హైదరాబాద్: కాళేశ్వరం కట్టింది, ఓపెన్ చేసింది బిఆర్ఎసేనని.. కూలింది తమ హయాంలోనే అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. బిఆర్ఎస్ కు చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే..కాళేశ్వరానికి ఈ గతి పట్టేది కాదని అన్నారు. మాజీ సిఎం కెసిఆర్, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పై పొంగులేటి విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..కాళేశ్వరం కట్టడానికి బిఆర్ఎస్ ప్రభుత్వానికి రూ.లక్షల కోట్లు వచ్చాయి కానీ పేదవాడికి ఇల్లు కట్టించి ఇవ్వడానికి వారికి మనసు రాలేదని పొంగులేటి మండిపడ్డారు. బిఆర్ఎస్ సలహాలు, సూచనలు ఇస్తామంటే అసెంబ్లీ పెడతామని, కాళేశ్వరం ఎనిమిదో వింత అన్న పెద్దమనిషి అసెంబ్లీకి రావాలని సూచించారు. బిఆర్ఎస్ చేసిన పాపాలన్నీ చెప్పి అసెంబ్లీ సాక్షిగా కడుక్కోవాలని, ఇప్పటికైనా అసెంబ్లీకి వచ్చి కాళేశ్వరంపై వివరణ ఇవ్వాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు.













