వర్తమాన కాలంలో ఇంధనమే అన్నిటికీ మూలం. పశ్చిమాసియాలో చెలరేగుతున్న యుద్ధజ్వాలల కారణంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ఉత్పత్తి ఎంత ముఖ్యమో ప్రపంచ దేశాలకు తెలిసివచ్చింది. ఈ విషయంలో భారత్ కొన్నేళ్ల క్రితమే కళ్లు తెరిచింది. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అన్వేషణకూ, ఉత్పత్తికీ నడుం బిగించింది. ఆ దిశగా సాధించిన మరో విజయమే హైడ్రోజన్ రైలుకు రూపకల్పన. హర్యానాలోని జింద్ సోనిపట్ రైల్వేస్టేషన్ల మధ్య నాలుగు రోజుల క్రితం పరుగు ప్రారంభించిన హైడ్రోజన్ రైలు ప్రజారవాణాలో ప్రత్యామ్నాయ ఇంధన వినియోగంపై ఆశలు మోసులెత్తిస్తోంది. డీజిల్ తో పనిలేని, విద్యుత్ అవసరం అసలే లేని ఈ కాలుష్యరహిత, పర్యావరణహిత రైలు భారత్ లాంటి జనాభాతో కిటకిటలాడే దేశాలకు ఎంతో అవసరం. హైడ్రోజన్ రైలును పట్టాలకు ఎక్కించడంతో ఇప్పటికే ఇలాంటి రైళ్లు వినియోగంలో ఉన్న జర్మనీ, అమెరికా, జపాన్, దక్షిణకొరియా, చైనా దేశాల సరసన భారత్ చేరింది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో నడిచే ఈ రైలు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకోవడం ఒక విశేషం కాగా, ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న హైడ్రోజన్ రైళ్లన్నింటిలోకీ శక్తిమంతమైనదీ, సుదూరం ప్రయాణించగలిగేదీ కావడం గమనార్హం.

మరొక విశేషమేమిటంటే, ఇతర దేశాలలో హైడ్రోజన్ రైళ్లకు మూడు లేదా నాలుగు కోచ్‌లే ఉంటే, మన రైలుకు పది వరకూ కోచ్‌లు ఉండటం. హైడ్రోజన్ రైలు కోసం కొత్తగా రైలును తయారు చేయడానికి బదులు, పాత డీజిల్ రైలునే హైడ్రోజన్ రైలుగా తీర్చిదిద్దడం ఇంకొక విశేషం. వాతావరణంలో అత్యధిక పరిమాణంలో లభించే హైడ్రోజన్‌ను వినియోగించి రైలు రవాణాకు ఊతం ఇవ్వవచ్చన్న ఆలోచనకు మొట్టమొదట శ్రీకారం చుట్టిన దేశం జర్మనీ. ఆ దేశం 2010లోనే హైడ్రోజన్ రైలును ప్రవేశపెట్టింది. జర్మనీ నుంచి స్ఫూర్తి పొందిన భారత్ నాలుగేళ్ల క్రితమే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌ను ప్రకటించింది. 2030 నాటికి ఏటా యాభై లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని లక్ష్యంగా చేసుకుని శ్రీకారం చుట్టిన ఈ మిషన్ ఆశించిన పంథాలోనే సాగుతోందనడానికి తాజాగా రూపుదిద్దుకున్న హైడ్రోజన్ రైలు ఉదాహరణ. హైడ్రోజన్ వినియోగంలో కార్బన్‌డయాక్సైడ్ కాకుండా కేవలం నీరు మాత్రమే విడుదల అవుతుంది కాబట్టి కర్బన ఉద్గారాల ప్రసక్తి ఉండదు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఇప్పటికిప్పుడు విద్యుత్ ఆధారిత రైల్వే వ్యవస్థకు ప్రత్నామ్నాయం కాజాలదనేది వాస్తవం. అయితే పునరుత్పాదక విద్యుత్ ఖర్చు తగ్గుతున్న కొద్దీ రానున్న కాలంలో గ్రీన్ హైడ్రోజన్‌దే అగ్రస్థానమనేది కూడా అంతే వాస్తవం. ఉత్పత్తి అయిన హైడ్రోజన్‌ను నిల్వచేయడం కష్టసాధ్యం కావడంతో ఈ దిశగా వివిధ దేశాలు ఉధృతంగా ప్రయోగాలు సాగిస్తున్నాయి. ఇటీవల కల్పాక్కం అణు పరిశోధనా కేంద్రంలో కాపర్ -క్లోరిన్ థర్మో కెమికల్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించి, అణుశక్తి ఆధారిత హైడ్రోజన్ ఉత్పత్తికీ భారత్ శ్రీకారం చుట్టింది.

ఈ దిశగా ఇంకా ప్రపంచ దేశాలు తొలి అడుగు కూడా వేయకపోవడం గమనార్హం. సాంప్రదాయక పద్ధతులలో ఉత్పత్తి అయ్యే గ్రే హైడ్రోజన్‌తో పోలిస్తే గ్రీన్ హైడ్రోజన్ తయారీకి రెండు రెట్ల ఖర్చు అదనంగా అవుతుంది. కాబట్టి, విద్యుత్ రైళ్లు తిరిగే మార్గాలలో హైడ్రోజన్ రైళ్లను వెంటనే ప్రవేశపెట్టడం వీలు కాకపోయినా, విద్యుత్ లైన్లులేని ప్రాంతాలలో, పర్వత ప్రాంతాలలో హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టడం సముచితం అనిపించుకుంటుంది. చారిత్రాత్మక, కొండల మార్గాలలో ‘హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్’ పేరిట 35 హైడ్రోజన్ రైళ్లను నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం ఇందులో భాగంగానే చూడాలి. చైనాతో ఘర్షణలు ‘మేకిన్ ఇండియా’ వేగాన్ని పెంచితే, పశ్చిమాసియాలో చమురు సంక్షోభం ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అన్వేషణ దిశగా భారత్‌ను పురికొల్పుతోంది. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద చమురు దిగుమతిదారుగా ఉన్న భారత్ ఏటా 13.5 లక్షల కోట్ల రూపాయలను కేవలం చమురు కోసమే వెచ్చిస్తోంది. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు సౌరశక్తి, ఇథనాల్, హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి కావలసిన సౌరశక్తికీ, సముద్రపు నీరుకూ ఏమాత్రం ఢోకాలేని భారత్‌లో హైడ్రోజన్ ఉత్పత్తి గాడినపడితే గ్లోబల్ గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా అవతరించేందుకు ఎంతోకాలం పట్టదన్నమాటే!