కరీంనగర్: ఓ పోలీస్ అధికారిని అన్నా అని పిలిచినందుకు సెలూన్ వర్కర్‌పై ఎస్‌ఐ దాడి చేసిన సంఘటన కరీంనగర్‌లో జరిగింది. త్రీటౌన్ ఎస్‌ఐ చందర్ సేవింగ్ కోసం సెలూన్‌కు వెళ్లాడు. రాము అనే బార్బర్ సదరు ఎస్‌ఐని కూర్చో అన్నా అని ముద్దుగా పిలిచాడు. వెంటనే ఎస్‌ఐ తనని అన్నా అంటావురా? అని బండ బూతులు తిట్టాడు. జాతి నుంచి మొదటు పెడితే ఇష్టారీతిన తిట్టడంతో పాటు బార్బర్‌పై దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రైనింగ్‌లో ఎస్‌ఐకి బండబూతులే నేర్పించారా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఒక వైపు ఉన్నతాధికారులు ప్రజలను సర్ అని పిలువాలని ఆదేశాలు జారీ చేసినప్పటికి కిందిస్థాయి సిబ్బంది పట్టించుకోవడంలేదని వాపోయారు. నిందితులతో కర్కశంగా ఉండాల్సిన పోలీసులు సామాన్యులపై ప్రతాపం చూపిస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు.