కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సోమవారంనాడు ప్రకటించారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌కు సక్సేనా ఆమోదం తెలిపారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ప్రకటించారు. ఇదొక చరిత్రాత్మకమైన రోజని, ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరిందని పేర్కొన్నారు. ప్రస్తుతం లద్దాఖ్‌లో లెహ్, కార్గిల్ జిల్లాలు ఉన్నాయి. కొత్తగా ఆమోదించిన ఐదు జిల్లాలతో వీటి సంఖ్య ఏడుకు చేరుకుంటుందని సక్సేనా తెలిపారు. కొత్తగా ఏర్పడనున్న జిల్లాల పేర్లను నుబ్రా, షామ్, చాంగ్‌థాంగ్, జన్‌స్కర్, ద్రాస్‌గా ఆయన పేర్కొన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలనా సౌలభ్యం పెరుగుతుందని, వృద్ధి, ఉపాధికి కొత్త మార్గాలు ఏర్పడతాయని తెలిపారు. పాలనను నేరుగా ప్రజల దగ్గరకు తీసుకు వెళ్లడంతో ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని చెప్పారు.