గుడిలోని విగ్రహంతో చెరువులో దూకినట్లు గుర్తింపు

మృతదేహం లభ్యం.. విగ్రహం కోసం డీఆర్‌ఎఫ్ బలగాల గాలింపు

ఫ్లాట్‌పై పోలీసుల అనుమానాలు

ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు ముమ్మరం

మన తెలంగాణ/బోడుప్పల్ : మేడిపల్లిలో శనివారం రాత్రి నగ్నంగా పరిగెత్తి విగ్రహంతో పాటు చెరువు లోకి దూకిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తేజస్విని ఆత్మహత్య కేసులో వింత మలుపు తిరిగింది. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తేజస్విని మృతి కేసులో ఆమె తీవ్ర మానసిక క్షోభతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. తల్లిదండ్రుల విడాకులు తీసుకోవడంతో తల్లి దగ్గరే ఉంటుంది.తరచూ వచ్చే భయానక కలల వల్ల ఆమె తీవ్ర మనోవేదనకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. పోలీసుల కథనం ప్రకారం.. తేజస్విని తన దుస్తులు విప్పేసి, దిగంబరంగా సమీపంలోని ఒక గుడిలోకి ప్రవేశించింది.అక్కడ ఉన్న అమ్మవారి విగ్రహాన్ని చేతుల్లోకి తీసుకుని నేరుగా సమీపంలోని చెరువు వైపు నడిచి, నీటిలోకి దూకింది. ఆ తర్వాత ఆమె మృతదేహం లభ్యమవగా, ఆమె తీసుకెళ్లిన విగ్రహం మాత్రం ఇంకా దొరకలేదు.

ఈ కేసులో ఆ విగ్రహం కీలక ఆధారంగా మారే అవకాశం ఉండటంతో, డీఆర్‌ఎఫ్ సిబ్బంది బోట్ల సహాయంతో చెరువులో విగ్రహం కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.ఈ దర్యాప్తులో తేజస్విని ఉంటున్న నివాసానికి సంబంధించిన కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఆమె ఒక అద్దె ఫ్లాట్‌లో ఉంటున్నట్లు, దానికి రోజుకు రూ. 3,500 చొప్పున నెలకు దాదాపు రూ. లక్ష వరకు అద్దె చెల్లించడం పలు అనుమానాలకు తావిస్తుంది. అంతేకాకుండా, ఆమె ఉంటున్న భవనంలోని పై రెండు అంతస్తులను అక్రమంగా ఒక లాడ్జిలా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.దీనికి తేజస్విని మృతికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.ప్రస్తుతానికి ఈ ఘటనను ఆత్మహత్యగా అనుమానిస్తున్నప్పటికీ, ఆమె అలా ప్రవర్తించడానికి గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు.పోలీసులు తేజస్విని తల్లి అరుణను ప్రశ్నించడంతో పాటు, ఆమె రాసినట్లుగా భావిస్తున్న డెత్ డిక్లరేషన్, ఇటీవలి ఆర్థిక లావాదేవీలు, సీసీటీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తున్నారు.