
మేడిపల్లి: మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధి పీర్జాదిగూడ శంకర్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. మానసిక ఆందోళనలతో ఓ యువతి గత అర్ధరాత్రి నగ్నంగా పరుగులు తీసి అనంతరం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విజయనగరం జిల్లాకు చెందిన తేజస్విని (27) అనే యువతి రెంట్ యాప్ లో ఇల్లు వెతికి మూడు నెలల క్రితం శంకర్ నగర్ లోని ఓ ఇంటిలో తల్లితో కలిసి నివాసం ఉంటుంది. కాగా గత అర్థరాత్రి తల్లి పడుకున్న సమయంలో తేజస్విని ఇంటి బయట నుంచి గడియ పెట్టి నగ్నంగా బయటికి పరుగులు తీసింది. ఇంటికి దగ్గరలోని బీరప్ప గుడిలో నుండి ఓ విగ్రహాన్ని తీసుకుని సమీపంలోని పీర్జాదిగూడ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తేజస్విని నగ్నంగా పరుగులు పెట్టి చెరువు వైపు వెళ్తున్న దృశ్యాలు సిసిటివి కెమెరాలలో రికార్డయ్యాయి. కాగా మానసిక ఆందోళనతోనే సదరు యువతి నగ్నంగా పరుగులు తీసి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.











