న్యూఢిల్లీ: జంతర్ మంతర్‌ వద్ద విద్యార్థుల నిరసణ జరిగినప్పటి నుంచి ప్రధాని మోడీ పేరిట పలు నకిలీ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిని ఇప్పటికే కేంద్రం ఖండిస్తూ వస్తోంది. అయినప్పటికీ ఏదో ఒక రకంగా ఈ నకిలీ వార్తలు వస్తున్నాయి. తాజాగా మోడీ సంతకం చేసిన లేఖ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ప్రధాని రాజీనామా చేశారంటూ పలువురు నెటిజన్లు దీనిని షేర్ చేస్తున్నారు. దీనిపై కేంద్రం ఆధ్వర్యంలోని పిఐబి ఫ్యాక్ట్‌చెక్ స్పష్టత ఇచ్చింది.

‘‘ప్రధాని మోడీ సంతకం చేసినట్టుగా ఉన్న లేఖ ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అదొక నకిలీ లేఖ. ప్రధాని సంతకం చేసిన అలాంటి లెటర్ ఏదీ జారీ కాలేదు. ఏదైనా ప్రచారాన్ని నమ్మే ముందు.. అధికారికంగా ధృవీకరించుకోండి. ఏదైనా సమాచారం అనుమానస్పదంగా అనిపించినప్పుడు సమాచారం ఇవ్వండి’’ అని పిఐబి ప్రజలను అప్రమత్తం చేసింది. ఇలాంటి తప్పుడు సమాచారంపై సంప్రదించేందుకు (91 8799711259, factcheck@pib.gov.in) ఫోన్ నంబర్, మొయిల్ ఐడిని షేర్ చేసింది.