న్యూఢిల్లీ: దేశంలో పెట్రోలు డీజిల్ ధరల పెంపుదల ప్రక్రియ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆధీన చమురు సంస్థలు సోమవారం మరో మారు ఇంధన ధరలు పెంచాయి. పెట్రోలుపై లీటరుకు రూ 2.61 పైసలు, డీజిల్‌పై లీటరుకు రూ 2.71పైసలు చొప్పున పెంచారు. రెండు వారాల కన్నా తక్కువ వ్యవధిలో పెట్రోలు, డీజిల్ రేట్లు పెరగడం ఇది నాలుగోసారి అయింది. గల్ఫ్ నుంచి చమురు సరఫరాలో ఆటంకాల ప్రభావం వీడకుండా వినియోగదారుడిపై పడుతోంది. ఇప్పుడు పెరిగిన రేట్లతో దేశంలో దాదాపుగా అన్ని నగరాలలో పెట్రోలు ధర లీటరకు రూ.100 దాటింది. దీనికి స్థానిక పన్నులు అదనం . ఇక డీజిల్ ధర కూడా నెమ్మదిగా శతకానికి చేరుకొంటోంది.

ఈ నెల 15వ తేదీ నుంచి వరుసగా పెట్రోలు డీజిల్ ధరలను పెంచుతూ వస్తున్నారు. ఇంతకాలం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు విపరీత ధరల ప్రభావం ఇక్కడి సగటు మనిషిపై పడకుండా చేశారని, ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో సవరణలకు దిగామని చమురు సంస్థలు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం, బిజెపి వర్గాలు ధరల పెంపుదల దశల్లో మనదేశంలోనే రేట్లు తక్కువ అనే విషయాన్ని గణాంకాలతో తెలియచేస్తున్నాయి.

ఇప్పటి పెంపుదల తరువాత ఢిల్లీలో పెట్రోలు రేటు లీటరుకు రూ 102.12 పైసలు అయింది. డీజిల్ రూ 95 దాటింది. 2022 మే నుంచి దేశంలో దాదాపుగా పెట్రోలు డీజిల్ ధరలల్లో ఎటువంటి మార్పులు లేకుండా నిశ్చల స్థితి ఉంటూ వచ్చింది. ఇప్పుడు అప్పటి నుంచి లెక్క తీసుకుంటే ఎప్పుడూ లేనంతగా ఇంధన రేటు పెరిగింది. ఫిబ్రవరిలో అమెరికా ఇరాన్ మధ్య ఘర్షణ తరువాతి క్రమంలో ఇది యుద్ధంగా విస్తరించుకుంటూ పోయిన దశలోనే క్రూడాయిల్ ధరలు పెరిగాయి. దీని ప్రభావం దేశీయ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది.