సినిమాలకు ధీటుగా ఒటిటిలో వచ్చే వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను ఎంతో అలరిస్తున్నాయి. ప్రముఖ ఒటిటి వేదిక నెట్‌ఫ్లిక్స్‌ నుంచి వస్తున్న మరో ఆసక్తికర వెబ్‌సిరీస్‌ ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’. సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ వార్ యాక్షన్ డ్రామా ఆగస్టు 7 నుంచి హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా సోమవారం ఈ సిరీస్ ట్రైలర్‌ని విడుదల చేశారు.

అభిజీత్ సింగ్ ఫార్మార్, కుషాల్ శ్రీవాత్సవ తీర్చిదిద్దిన ఈ సిరీస్‌కు ఓనీ సేన్ దర్శకత్వం వహించారు. ఇందులో సిద్ధార్థ్ స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహుజాగా నటిస్తున్నారు. ఆయనతో పాటు జమ్మి షెర్గిల్, అభయ్ వర్మ, దియా మీర్జా తదితరులు కీలక పాత్రలు పోషించారు. కార్గిల్ యుద్ధం సమయంలో భారత వైమానిక దళం నిర్వహించిన ఆపరేషన్ నేపథ్యంలో ఈ సిరీస్‌ని రూపొందించారు.