యుపిఎస్‌సి సహా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఆధునిక సాంకేతికతతో నాణ్యమైన మార్గదర్శకత్వం అందించేందుకు రూపొందించిన ‘ప్రెప్‌మంకీ’ అనే కృత్రిమ మేధస్సు ఆధారిత యాప్‌ను రాష్ట్ర ఐటి మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సాంకేతికతను విద్యా రంగానికి అనుసంధానం చేయడం ద్వారా విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించవచ్చని అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు కూడా సరైన మార్గదర్శకత్వం లభిస్తే ఉన్నత స్థాయికి చేరుకోగలరని పేర్కొన్నారు.

పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఈ యాప్ ఎంతో ఉపయోగకరంగా మారుతుందని చెప్పారు. డిజిటల్ విద్యా విప్లవంలో ఇలాంటి వినూత్న ఆలోచనలు మరింత ముందుకు రావాలని ఆకాంక్షించారు. విద్యా నిపుణులు,సాంకేతిక నిపుణులు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ యాప్‌లో స్మార్ట్ నోట్స్, సమాధానాల మూల్యాంకనం, అనుకూల ప్రశ్నా బ్యాంకులు, తక్షణ పనితీరు విశ్లేషణ, మెంటార్ సహాయం వంటి ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి. ప్రెప్‌మంకీ వ్యవస్థాపక బృందంలో తలశిల రంజిత్, సుధాకర్, రామ్ అభినవ్ తేజ్, పావని, ఆకాశ్, మేఘనా రెడ్డి ఉన్నారు.