ఇండిగో విమానం ఇక్కడ నుంచి రాయ్‌పూర్‌కు బయలుదేరుతుండగా రన్‌వేపై కోతుల సంచారంతో టేకాఫ్ ఆగిపోయింది. ఎయిర్‌పోర్టు వర్గాలు శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించాయి. గురువారం ఇండిగో విమానం 6ఇ6521 మొత్తం 150 మంది ప్రయాణికులతో బయలుదేరుతుండగా ఉదయం 9 గంటల ప్రాంతంలో రన్‌వేపై అడ్డుగా కోతులు దాటుకుంటూ రావడాన్ని పైలట్ గుర్తించారు. వెంటనే టేకాఫ్ నిలిపివేసి ట్రాఫిక్ కంట్రోల్‌కు విషయం తెలియజేశారు. దాంతో విమానాన్ని తిరిగి వెనక్కు తీసుకు వచ్చి తిరిగి ఇంధనం నింపాక గంట తరువాత బయలుదేరారు.

టేకాఫ్ నిలిపివేయడానికి చాలా ఇంధనం అవసరమైంది. దాంతో విమానం విమానం బయలుదేరడం ఆలస్యం కావడమే కాక, మిగతా విమానాలు బయలుదేరడం ఆలస్యమైంది. ఈ సంఘటనకు పది నిమిషాల ముందు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం విమానాశ్రయంలో దిగింది.సమీపాన రన్‌వేపై కోతుల గుంపు ఉందని ఆ విమానం పైలట్ చెప్పి అధికారులను అప్రమత్తం చేశాడు. ఈ సంఘటన తరువాత ఎయిర్‌పోర్టు వన్యమృగ నిర్వహణ సిబ్బంది రన్‌వేను ఖాళీ చేయించిన తరువాత విమానాలు యథాప్రకారం బయలుదేరాయి.