
హైదరాబాద్: ఏ ఒక్క ఊరిలో కాంగ్రెస్ వందశాతం రుణమాఫీ చేసినట్టు చూపెట్టాలని అడిగానని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. వందశాతం రుణమాఫీ చూపెడితే రాజీనామా చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీ కూడా సక్రమంగా చేయలేదని, షాపులో లేని యూరియా యాప్ లో దొరుకుతదా అని ప్రశ్నించారు. కరెంట్ కూడా సక్రమంగా ఇవ్వడం లేదని, ధాన్యం బస్తాలు కూడా దొరకడం లేదని విమర్శించారు. సంచులన్నీ ఢిల్లీకి పంపుతున్నారని, 4 సార్లు రైతుబంధు ఎగ్గొట్టారని కెటిఆర్ మండిపడ్డారు. కౌలు రైతులకు రూ. 15 వేలు ఇస్తానని మోసం చేశారని, మహిళలకు రూ.2,500 ఇస్తానని దగా చేశారని ధ్వజమెత్తారు. వృద్ధులకు రూ. 4 వేల పెన్షన్ ఇవ్వలేదని, ఒక ఎకరానికి ఒక మీటింగ్ పెడుతున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం దగ్గర నీళ్లు సముద్రం లోకి వెళ్తున్నాయని, పంప్ ఆన్ చేస్తే నిజాం సాగర్ నిండుతుందని సూచించారు. సిఎం రేవంత్ రెడ్డి చెప్పిన అబద్ధమే ఆయనకు అడ్డం వస్తుందని దుయ్యబట్టారు. లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా పోతుందని, రైతులంటే రేవంత్ కు పట్టింపు లేదని కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.











